తల్లిని చంపి.. శ్మశానంలో పాతి పెట్టి

1 Jun, 2018 08:15 IST|Sakshi
తల్లి మృతదేహాన్ని పోలీసులకు  చూపిస్తున్న నిందితుడు విక్రమ్‌ దాస్‌  

బరంపురం : జిల్లాలోని రంబాలో అనారోగ్యం తో బాధపడుతున్న తల్లిని సొంత కొడుకు హత్య చేసి శ్మశానంలో పాతి పెట్టిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న రంబా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన వృద్ధురాలి మృతదేహాన్ని బయటకి తీసి నిందితుడైన కొడుకును అరెస్ట్‌ చేశారు. ఐఐసీ  అధికారి అందించిన సమచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గంజాం జిల్లాలోని రంబా పోలీస్‌ స్టేషన్‌ పరిధి సంతోష్‌పూర్‌ గ్రామంలో నివాసం ఉంటున్న విక్రమ్‌ దాస్‌ తల్లి కొద్ది రోజులుగా తీవ్ర ఆనారోగ్యంతో బాధ పడుతోంది.

ఆమెకు ఎన్ని ఆరోగ్యచికిత్సలు చేయించినప్పటికీ నయం కాలేదు. ఇటువంటి పరిస్థితిలో కొడుకు విక్రమ్‌ దాస్‌ విసుగు చెంది తల్లిని హత్య చేసి గోనె సంచిలో మృతదేహాన్ని చుట్టి దగ్గరలో ఉన్న శ్మశానంలో పాతిపెట్టాడు. ఈ విషయం   గ్రామంలో అనోట ఈ నోట చర్చనీయాంశంగా మారడంతో గ్రామపెద్ద పోలీసులకు గురువారం సమచారం చేరవేశాడు. దీంతో  రంబా పోలీసులు సంఘటనా స్థలానికి  చేరుకుని పాతిపెట్టిన వృద్ధురాలి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడైన కొడుకు విక్రమ్‌ దాస్‌ను అరెస్ట్‌చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు