మద్యం కోసం కన్నతల్లిని చంపిన యువకుడు

8 Jul, 2019 14:38 IST|Sakshi

న్యూఢిల్లీ : మద్యం తాగటానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంలో కన్నతల్లిని కత్తితో పొడిచి చంపేశాడో యువకుడు. హత్య అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ సంఘటన ఢిల్లీలోని మోడల్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని విజయ్‌ నగర్‌కు చెందిన దీపక్‌ అనే యువకుడు మద్యానికి బానిసయ్యాడు. తాగడానికి డబ్బులు ఇవ్వాలంటూ తల్లిని ఇబ్బంది పెట్టేవాడు. ఆదివారం కూడా ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం తాగటానికి డబ్బులు ఇవ్వాలని  తల్లిని కోరాడు. అయితే ఆమె ఇందుకు అంగీకరించలేదు. మద్యం తాగటం మానాలని అతడ్ని తిట్టింది. దీంతో అతడు ఆ‍గ్రహానికి గురై కత్తితో ఆమెపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా ఆమెను పొడిచి చంపాడు.

అనంతరం దగ్గరలోని మోడల్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడి పోలీసులతో ‘‘నేను మా అమ్మను హత్య చేశాను’’ అని చెప్పాడు. అయితే దీపక్‌ తాగి ఉండటం వల్ల అతడి మాటలు వాళ్లు నమ్మలేదు. అతడి బట్టలపై ఉన్న రక్తపు మరకలను చూపించాడు. దీంతో నమ్మిన వారు దీపక్‌ వెంట అతడి ఇంటికి వెళ్లారు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ శవాన్ని కనుగొన్నారు. ఆమెను దీపక్‌ తల్లి ఆశా దేవిగా గుర్తించారు. అనంతరం అతడ్ని అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు