కన్నకొడుకే యముడయ్యాడు..

29 Oct, 2019 10:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: కన్నకొడుకే యముడయ్యాడు. తల్లిదండ్రులను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియం గ్రామానికి చెందిన రమేష్‌.. తల్లిదండ్రులపై దాడి చేశారు. రాడ్డుతో కొట్టి హతమార్చాడు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్‌ కోసం గాలిస్తున్నారు.

కడియం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు-మార్తమ్మ దంపతులకు వీరికి నలుగురు సంతానం. మూడో కుమారుడు రమేష్‌కు 28ఏళ్లు. పెయింటిగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఇతని మానసికపరిస్థితి సరిగా లేకపోవడంతో... పెళ్లి చేస్తే మార్పు వస్తుందని భావించారు. మూకవోలు గ్రామానికి చెందిన మహిళతో ఏడాది క్రితం వివాహం చేశారు. కానీ రమేష్‌లో ఏ మార్పు రాలేదు. దీంతో అతని భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి తల్లిదండ్రులతోనే ఉంటున్న రమేష్‌... తరచూ వారితో గొడవపడేవాడని స్థానికులు చెప్తున్నారు. ఈ తెల్లవారుజామున ఇంట్లో నుంచి గట్టిగా కేకలు వినపడడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూశారు. అప్పటికే రమేష్‌ ఇనుపరాడ్డుతో తల్లిదండ్రుల తలపై గట్టిగా కొట్టేశాడని చెప్తున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారని అంటున్నారు. జనాలను చూసి రమేష్‌ పరారయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు