అత్తను హతమార్చిన అల్లుడు

14 May, 2020 13:38 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఆత్మకూరు సీఐ, ఎస్సైలు

భార్యను కాపురానికి పంపలేదని దారుణం

ఉలికి పడిన సీబీవరం

నెల్లూరు, అనుమసముద్రంపేట: భార్యను కాపురానికి పంపడం లేదని అత్తను ఓ అల్లుడు దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన బుధవారం ఏఎస్‌పేట మండలం చౌటభీమవరంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మేకల పోలమ్మ, చిన్నయ్య కుమార్తె దొరసానమ్మను 20 ఏళ్ల క్రితం మండలంలోని దూబగుంటకు చెందిన సోలా తిరుపాలుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే తిరుపాలు గొర్రెల కాపరిగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

దీంతో ఏడాది క్రితం దొరసానమ్మ భర్తను వదిలి చౌటభీమవరంలోని తల్లి వద్దకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంది. అప్పటి నుంచి తిరుపాలు తన భార్యను కాపురానికి పంపించాలంటూ అత్తతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం దొరసానమ్మ పనికి వెళ్లి వచ్చిన తర్వాత తల్లి పోలమ్మను మంచి నీళ్లు తేవాలని పంపింది. ఆ సమయంలో గ్రామంలో కాపు కాసి ఉన్న తిరుపాలు ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. చేతిపై, మెడపై కత్తితో నరకడంతో పోలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు పరారయ్యా డు. విషయం తెలు సుకున్న ఆత్మకూరు సీఐ పాపారావు, ఏఎస్‌పేట ఎస్సై గోపాల్‌   ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు  
అత్తను హత్య చేసి పరారైన నిందితుడు తిరుపాలు పక్క గ్రామంలోని అబ్బీపురం చెరువు వద్దనున్నాడని విషయం తెలుసుకున్న స్థానిక యువకులు పోలీసులతో కలిసి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

మరిన్ని వార్తలు