అత్తను నరికి చంపిన అల్లుడు

20 Nov, 2018 08:31 IST|Sakshi
అల్లుడి చేతిలో హత్యకు గురైన బవిరి చంటమ్మ, ఘాతుకానికి పాల్పడిన అల్లుడు జాజిముగ్గుల దుర్గాప్రసాద్‌

గోకవరం మండలం కొత్తపల్లిలో దారుణం

తూర్పుగోదావరి, గోకవరం (జగ్గంపేట): మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.పిల్లనిచ్చిన అత్తను ఓ అల్లుడు కత్తితో అతికిరాతంగా నరికి చంపాడు. ఈ సంఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొత్తపల్లి గ్రామంలో చాకలిపేటకు చెందిన బవిరి చంటమ్మ (65) కుమార్తె దుర్గను ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన జాజిముగ్గుల దుర్గాప్రసాద్‌కు మూడేళ్ల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి రెండేళ్ల వయస్సు గల బాబు ఉన్నాడు. దివ్యాంగురాలైన దుర్గ సామర్లకోట వెలుగు కార్యాలయంలో పని చేస్తోంది. భార్య కాపురానికి రావడం లేదని, దీనికి అత్త కారణమని ఆమెపై కక్ష పెంచుకున్నాడు. దీనిపై తరచూ అత్తతో గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం కొత్తపల్లి వచ్చి అత్తతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న కత్తితో అత్తపై విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో చంటమ్మ చేతి మణికట్టు సైతం తెగిపడింది. ఈ దాడిని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

చంటమ్మకు నడుము, మెడ భాగాల్లో లోతైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై జి.ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఘాతుకానికి పాల్పడిన దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని కోరుకొండ సీఐ రవికుమార్‌ సందర్శించారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికితరలించామన్నారు.

మరిన్ని వార్తలు