సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రి అనే కనికరం లేకుండా అతి క్రూరంగా ప్రవర్తించాడో కొడుకు. తండ్రిని ముక్కలు ముక్కులుగా నరికి బకెట్లో నింపాడు. ఈ సంఘటన గురువారం నాడు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మల్కాజ్గిరి మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన మారుతీ (80) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అతడి కుమారుడు కిషన్ (30) జులాయిగా మారి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో గురువారం కూడా ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. మాటామాటా పెరిగింది!దీంతో ఆగ్రహానికి గురైన కిషన్ తండ్రిని కత్తితో పొడిచి చంపాడు.
అనంతరం తండ్రి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లో కుక్కాడు. హత్య జరిగి మూడు రోజులు కావస్తుండటంతో బకెట్నుంచి దుర్వాసన రావటం ప్రారంభమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మనిషి శరీర భాగాలు ముక్కలుగా చేసి బకెట్లో వేసినట్లు కనుగొన్నారు. కిషన్ తండ్రి మారుతిని హత్యచేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.