కొడుకుతో ప్రాణహాని ఉందని హత్య చేసిన వృద్ధుడు

19 Jul, 2019 13:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ఓ తండ్రి తన కొడుకుని చంపి ఆ శవంతోనే రాత్రంత్రా కూర్చొని ఉదయం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 71 ఏళ్ల వయస్సు గల దామోదర్‌ 38 ఏళ్ల తన కొడుకు సంజయ్, మనవడితో కలిసి నాగపూర్‌లో నివసిస్తున్నారు. బుధవారం సంజయ్‌ ద్విచక్ర వాహనం కొనడానికి తండ్రిని రూ. 25 వేలు అడగ్గా, తండ్రి నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కొడుకుతో తనకు ప్రాణహాని ఉందని భయపడ్డ దామోదర్‌.. బుధవారం రాత్రి పదునైన వస్తువుతో తల మీద కొట్టి కొడుకుని చంపేశాడు. అనంతరం తన బంధువులను పిలిపించి జరిగిందంతా చెప్పి తెల్లారే వరకు అక్కడే కూర్చున్న దామోదర్‌ ఉదయం పోలీసులకు లొంగిపోయాడు.

కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సంజయ్‌ కూడా తండ్రి లాగే వడ్రంగి పనులు చేసేవాడని, గతంలో తన మామను చంపిన కేసులో అనేక సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదల అయ్యాడని పేర్కొన్నారు. దీంతో అతడి భార్య కుమార్తెను తీసుకొని కొడుకుని సంజయ్‌ వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిందని అప్పటి  నుంచి సంజయ్‌ తన కొడుకు, తండ్రితో ఉంటున్నాడని తెలిపారు. అయితే మద్యానికి బానిసైన సంజయ్‌ డబ్బుల కోసం తండ్రిని హింసించేవాడని.. డబ్బులు ఇవ్వకుంటే దామోదర్‌ను, కొడుకుని చంపేస్తానని బెదిరించేవాడని తెలిపారు. కాగా కొడుకును హత్య చేసిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేసి.. జూలై 22 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

మరిన్ని వార్తలు