బైక్‌పై తల్లిశవంతో 35 కిలోమీటర్లు..

11 Jul, 2018 09:38 IST|Sakshi
తల్లి మృతదేహాన్ని బైక్‌పై తరలిస్తున్న రాజేశ్‌

టికామ్‌గఢ్ ‌: మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పోస్టుమార్టం కోసం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని నిరాకరించడంతో  తన తల్లి శవాన్ని బైక్‌పై తరలించాడు ఓ వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మస్తాపూర్‌ గ్రామానికి చెందిన కున్వర్‌ భాయ్‌ అనే మహిళ గత ఆదివారం పాముకాటుకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించాల్సిందిగా సూచించారు. పోస్టుమార్టం కోసం వాహన సదుపాయాన్ని కల్పించాల్సిందిగా కున్వర్‌ భాయ్‌ కుమారుడు రాజేశ్‌ ఆస్పత్రి సిబ్బందిని కోరాడు. దీనికి సిబ్బంది నిరాకరించింది. దీంతో గత్యంతరం లేక తన బైక్‌పై తల్లి శవాన్ని 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోస్టుమార్టం సెంటర్‌కు తరలించాడు. ఈ ఘటనను స్థానిక ప్రజలు వీడియో తీసు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పడా వీడియో వైరల్‌ అయింది.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమెను సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే బతికేదన్నారు. ‘పాముకాటుకు గురైన మహిళను మొదటగా స్థానికంగా ఉన్న దేవాలయంకు తరలించారని, అనంతరం ఆస్పత్రికి తరలించారు. సమయం మించిపోవడంతో ఆమె చనిపోయినట్లు విచారణలో తేలింది’ అని కలెక్టర్‌ తెలిపారు.  అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి ఉంటే వాహన సదుపాయం కల్పించేవాళ్లని పేర్కొన్నారు .

మరిన్ని వార్తలు