అమానుషం.. కొడుకు పెట్టే హింస భరించలేక...

2 Feb, 2018 18:48 IST|Sakshi

జైపూర్‌ : వృద్ధాప్యంలో ఉన్న తల్లికి సేవలు చేయటం ఆ కొడుకు భారమైపోయింది. అమానుషానికి తెగబడ్డాడు. ఇష్టం వచ్చినట్లు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కన్న కొడుకు పెట్టే హింసను కొన్ని రోజులు భరించిన తల్లి చివరకు ప్రాణాలు వదిలింది. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

జోగేంద్ర చౌదరి స్థానికంగా ఓ స్కూల్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు . తండ్రి చనిపోవటంతో తల్లి కొడుకు జోగేంద్ర వద్దకు చేరింది. అయితే వయో భారం, పైగా ఈ మధ్యే పక్షవాతం సోకటంతో ఆమె సొంతగా పనులు చేసుకోలేకపోతోంది. దీంతో ఇంట్లో వాళ్ల సాయం తీసుకుంటోంది. ఈ క్రమంలో జోగేంద్రకు.. అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై కోపంతో జోగేంద్ర తల్లిని హింసించటం ప్రారంభించాడు. ఆ బాధలను భరించలేక తొమ్మిది రోజుల క్రితం ఆ కన్నతల్లి కన్నుమూసింది. 

అయితే ఆమె మనవడు మాత్రం జోగేంద్ర ఓరోజు తల్లిని హింసిస్తుండగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్‌ అయి చివరకు విషయం పోలీసుల దాకా చేరటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు