బుకీ ఫారెన్‌లో... పంటర్లు సిటీలో!

13 Jun, 2019 08:06 IST|Sakshi
పోలీసులు అరెస్టుచేసిన నిందితులు

క్రికెట్‌ బెట్టింగ్స్‌ కోసమే ప్రత్యేకంగా యాప్‌  

దళారుల ద్వారా కథ నడుపుతున్న సూత్రధారి

ఆర్థిక లావాదేవీలు అన్నీ హవాలా మార్గంలోనే

గుట్టురట్టు చేసిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

సాక్షి, సిటీబ్యూరో/ సనత్‌ నగర్‌: క్రికెట్‌ బెట్టింగ్స్‌ నిర్వహణలో ఇదో హైటెక్‌ పంథా... పోలీసు నిఘాకు చిక్కకుండా ఆద్యంతం అనేక జాగ్రత్తలు తీసుకున్నారు... విజిట్‌ వీసాపై వెళ్ళి అమెరికాలో తిష్టవేశాడు ప్రధాన బుకీ... పందేల కోసమే ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేయించాడు. సబ్‌–బుకీలకు గోవాలో సకల సౌకర్యాలతో బస ఏర్పాటు చేశాడు. వీళ్ళు దళారుల సాయంతో నగరంలోని పందెంరాయుళ్ళ (పంటర్లు) ద్వారా దందా నడిపిస్తున్నారు. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభంతో మొదలై, వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ వ్యవహారం గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి రూ.8 లక్షల నగదు, కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ బుధవారం వెల్లడించారు. 

అమెరికాను అడ్డాగా చేసుకుని...
నగరంలోని సింధికాలనీ ప్రాంతానికి చెందిన బర్కత్‌ లలానీ పాఠశాల స్థాయిలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు దానికి అవసరమైన ఖర్చుల కోసం తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడి దృష్టి క్రికెట్‌ బెట్టింగ్స్‌పై పడింది. హైదరాబాద్‌ కేంద్రంగా కొన్నాళ్ళు నిర్వహించినప్పటికీ ఆపై పోలీసుల నిఘాకు భయపడ్డాడు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభంకావడానికి ముందే విజిట్‌ వీసాపై అమెరికా వెళ్ళాడు. అక్కడ ఉంటూనే బెట్టింగ్స్‌ నిర్వహణకు ప్రత్యేకంగా ‘మ్యాచ్‌బాక్స్‌9.కామ్‌’ పేరుతో యాప్‌ తయారు చేయించాడు. బెట్టింగ్స్‌ నిర్వహణకు అవసరమైన రికార్డులు, స్లిప్స్, పత్రాలు, మ్యాచ్‌ చూడటానికి టీవీ, రెష్యో తెలుసుకోవడానికి ఫోన్‌... ఇలా ఏదీ అవసరం లేకుండా కేవలం స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా అటు పంటర్లు, ఇటు బుకీ దందా నిర్వహించడానికి ఉపయుక్తంగా దీన్ని రూపొందించాడు. దీని అడ్మిన్‌గా అతడే ఉండి సకల లావాదేవీలు అనునిత్యం పరిశీలించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. 

డిపాజిట్‌ చేస్తేనే లింకు పంపేది...
తనకు పరిచయస్తులైన దానిష్, సోహైల్, సాహిల్‌లను ప్రధాన అనుచరులుగా మార్చుకున్నాడు. మ్యాచ్‌లకు చెందిన సిరీస్‌ ప్రారంభంకావడానికి ముందు సింధికాలనీకి చెందిన ఈ ముగ్గురినీ గోవాకు పంపిస్తాడు. అక్కడ వీరికి సకలసౌకర్యాలతో బస ఏర్పాటు చేస్తాడు. బెట్టింగ్‌ యాప్‌నకు సంబంధించిన లింకు వీరి వద్ద మాత్రమే ఉంటుంది. ఈ ముగ్గురూ నగరానికి చెందిన మోహిత్‌ జైన్, నిఖార్‌ మహేశ్వరి, రాహుల్‌జైన్, వైభవ్‌ సాల్విలను సబ్‌–బుకీలుగా నియమించుకున్నారు. స్థానికంగా ఉన్న పంటర్లలో నమ్మకమైన వారిని గుర్తించే వీళ్ళు వారికి ఈ యాప్, బెట్టింగ్స్‌ దందాలను వివరిస్తారు. పంటర్లుగా మారడానికి ఆసక్తిచూపిన వారితో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిపాజిట్‌గా గోవాలోని వారికి చెల్లించేలా చేస్తాడు. ఈ డబ్బు ముట్టిన వెంటనే వాళ్ళు యాప్‌నకు సంబంధించి లింకును వాట్సాప్‌ ద్వారా పంటర్లకు పంపిస్తారు. యాప్‌ ద్వారా పందేలు కాస్తూ డిపాజిట్‌ మొత్తం ఖాళీ అయ్యే వరకు వీళ్ళు పాలుపంచుకోవచ్చు. ఆపై మళ్ళీ డిపాజిట్‌ చేసి కొనసాగాల్సి ఉంటుంది. కొందరు పంటర్ల నుంచి డబ్బు వసూలు చేయడానికి జయానీ రూపానీ, నిజాం గిలానీలను కలెక్షన్‌ ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నారు.  

మూడు శాతం కమీషన్‌ తీసుకుంటూ...
గోవాలో కూర్చున్న ముగ్గురూ ఈ యాప్‌కు సంబంధించిన లైన్‌ను నిర్వహిస్తూ బెట్టింగ్‌ రేష్యోలు తెలుసుకుని అప్‌డేట్‌ చేస్తుంటారు. ఈ పంథాలో బర్కత్‌ ఒక్కో మ్యాచ్‌కు గరిష్టంగా రూ.50 లక్షల వరకు టర్నోవర్‌ చేస్తున్నాడు. నగరంలో ఉన్న సబ్‌–బుకీలు, కలెక్షన్‌ ఏజెంట్లు ఈ మొత్తంలో మూడు శాతం కమీషన్‌గా తీసుకుని మిగిలింది గోవాలోని వారికి పంపిస్తారు. వాళ్ళు తమకు రావాల్సింది మినహాయించుకుని మిగిలిన మొత్తం బర్కత్‌కు చేరవేస్తుంటారు. ఈ లావాదేవీలు అన్నీ హవాలా మార్గంలోనే నడిపిపోతున్నాయి. ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు జరుగుతుండటంతో బర్కత్‌ జోరుగా బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్‌ ప్రసాద్‌వర్మ, ఎన్‌.శ్రీశైలం,వి.నరేందర్, తర్ఖుద్దీన్‌లు సింధికాలనీలోని ఓ ప్రాంతంపై దాడి చేశారు. బర్కత్,డానష్, సోహైల్, సాహిల్‌ మినహా మిగిలిన ఆరుగురినీ పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును రామ్‌గోపాల్‌పేట పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు