శ్రీ చైతన్య విద్యార్థి అదృశ్యం

20 Nov, 2017 02:11 IST|Sakshi

చనిపోతున్నానంటూ సూసైడ్‌ నోట్‌

నిజామాబాద్‌ క్రైం: శ్రీ చైతన్య కళాశాలలో చదివే నిజామాబాద్‌కు చెందిన విద్యార్థి సూసైడ్‌ నోట్‌ రాసి కాలేజీ నుంచి అదృశ్యమయ్యాడు. నిజామాబాద్‌కు చెందిన చింతల లక్ష్మణ్‌ కుమారుడు సాయిగణేశ్‌ హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య గండిమైసమ్మ బ్రాంచ్‌లో ఎంపీసీ చదువుతున్నాడు. ఈ నెల 13న నిజామాబాద్‌కు వచ్చిన అతడు తిరిగి కళాశాలకు వెళ్లాడు. ఆదివారం లక్ష్మణ్‌ హైదరాబాద్‌కు పని మీద వెళ్లాడు. మధ్యాహ్నం కళాశాల నిర్వాహకులు ఫోన్‌ చేసి.. మీ కుమారుడు కనిపించటం లేదని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన అతడు హుటాహుటిన కళాశాలకు వెళ్లి ఆరా తీశాడు.

కళాశాల సిబ్బంది గండిమైసమ్మ పోలీస్‌స్టేషన్‌లో గణేశ్‌ అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. కళాశాల హాస్టల్‌లో లక్ష్మణ్‌కు గణేశ్‌ గదిలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. అందులో ‘ఐ మిస్‌ యూ డాడీ, ఐ మిస్‌ యూ మమ్మీ’ అని రాశాడు. లేఖలో తాను చనిపోతున్నట్లు రాసి ఉన్నట్లు తండ్రి చెబుతున్నారు. అందులోని చేతిరాత తన కొడుకుది కాదని, 4 రకాలుగా రైటింగ్‌ ఉందని, దీనిపై అనుమానం ఉందని లక్ష్మణ్‌ అంటున్నారు. శనివారం రాత్రి తల్లితో సంతోషంగానే మాట్లాడినట్లు లక్ష్మణ్‌ తెలిపాడు.  

మరిన్ని వార్తలు