ఎల్లలు దాటిన ఫేస్‌బుక్‌ ప్రేమ

11 Mar, 2020 07:44 IST|Sakshi

ప్రియుడి కోసం శ్రీలంకనుంచి వచ్చిన ప్రియురాలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి తండ్రి

చెన్నై,టీ.నగర్‌: ఫేస్‌బుక్‌లో పరిచయమైన బన్రూట్టి ప్రియుడిని చూసేందుకు వచ్చిన ప్రియురాలిని రక్షించాలని ఆమె తండ్రి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీలంక రత్నపురా జిల్లాకు చెందిన జైనుల్లా పుదిన్‌ కుమార్తె రిజ్వి ఫాతిమా గుప్తా (21). బన్రూట్టి సమీపంలోని వి.ఆండికుప్పం గ్రామానికి చెందిన మహ్మద్‌ ముబారక్‌ (25) చెన్నైలో ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. ఇద్దరికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో ప్రేమగా మారింది. ఇలా ఉండగా ప్రియుడిని చూసేందుకు ప్రియురాలు తమిళనాడుకు వచ్చేందుకు ఆశపడింది. ఈ విషయం తన ప్రేమికుడికి తెలిపింది. దీంతో జనవరి 26న టూరిస్టు వీసా ద్వారా శ్రీలంక నుంచి చెన్నైకు విమానం ద్వారా వచ్చింది. తరువాత బన్రూట్టికి వచ్చి ప్రియుడితో బసచేసింది.

రిజ్వి ఫాతిమా తల్లిదండ్రులు కువైట్‌లో పని చేస్తుండడంతో కుమార్తె ప్రేమ వ్యవహారం తెలియకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం శ్రీలంకలోని వారి బంధువులు కువైట్‌లో నివసిస్తున్న రిజ్వి ఫాతిమా తల్లిదండ్రులకు కుమార్తె ప్రేమ వ్యవహారం గురించి తెలిపారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు అత్యవసరంగా బయలుదేరి చెన్నైకి చేరుకున్నారు. కడలూరు జిల్లా ఎస్పీ శ్రీఅభినవ్‌కు జరిగిన సంఘటన గురించి వివరించారు. తమ కుమార్తెను రక్షించాలని ఫిర్యాదు చేశారు. అనంతరం బన్రూట్టి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆండికుప్పానికి వెళ్లారు. అయితే అక్కడ ఇరువురు కనిపించలేదు. దీంతో ఇరువురి కోసం గాలిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు