ప్రేమించలేదని దారుణం..టెకీ మరణం

14 Nov, 2017 11:32 IST|Sakshi

సాక్షి, చెన్నై:  ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ టెకీ కుటుంబంపై దాడి చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. చెన్నై అదాంబక్కంలో  సోమవారం రాత్రి  ఈ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ఇందూజ ప్రాణాలు  కోల్పోగా, ఆమెతల్లి, సోదరి  మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రేమించమని వెంటబడి ఈ దారుణానికి ఒడిగట్టిన అశోక్‌ పరారీలో  ఉన్నాడు.
 
వివరాల్లోకి వెళితే...ఇందుజా, అశోక్‌ ఒకే కాలేజీలో  ఇంజనీరింగ్‌ చదువుకున్నారు.  ఇందుజాను   ప్రేమిస్తున్నానని గత నెలరోజులుగా వెంటడుతున్నాడు. కానీ దీన్ని  ఇందూజ తిరస్కరించింది.  ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకున్న ఇందూజ స్థానిక కంపెనీలో ఇటీవలే ఉద్యోగంలో చేరింది.   అయితే అశోక్‌ వేధింపులకు తట్టుకోలేక గత నెల రోజులుగా ఇంట్లోనే ఉంటోంది.  ఇంతలోనే అశోక్‌ ఈ  అఘాయిత్యానికి తెగబడ్డాడు. 

ప్రేమించమని వేధిస్తోన్న అశోక్‌ సోమవారం మరోసారి ఆమె ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు అతనితో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారి  తలుపు తీయమని అశోక్‌  వాదనకు దిగాడు. దీంతో వారు తలుపు తీయగానే... క్యాన్‌తో  వెంట తెచ్చుకున్న  పెట్రోల్‌ను ఇందూజ, ఆమె తల్లి రేణుక, సోదరి నివేదితపై  పోసి నిప్పంటించి పారిపోయాడు.   విషయం గమనించిన ఇరుగు పొరుగువారు వారిని హుటాహుటిన స్థానిక  కేంఎసీ ఆసుపత్రికి తరలించారు.  తీవ్ర గాయాలతో..ఇందూజ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. తల్లి రేణుక 49శాతం  కాలిన గాయాలతో, నివేదిత 23శాతం గాయాలతో  చికిత్స పొందుతున్నారు.  

మరోవైపు ఇందూజ సోదరుడు విదేశంలో ఉన్నారని ఇందూజ బంధువు ఒకరు చెప్పారు. అలాగే గత నెల రోజులుగా అశోక్‌ ఇందూజ వెంటపడుతున్నాడని.. అన్న ఇంట్లో లేడనితెలిసి దాడికి దిగాడని ఆరపించారు. 
 

మరిన్ని వార్తలు