స్టార్‌ హోటల్స్‌ కేంద్రంగా వ్యభిచారం

18 Dec, 2017 02:16 IST|Sakshi
మోనిశ్‌ , వెంకట్‌రావు

సినీ తారలతో వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా 

ఏకకాలంలో రెండు హోటల్స్‌పై టాస్క్‌ఫోర్స్‌ దాడి 

ప్రధాన నిర్వాహకుడితో పాటు మరొకరు అరెస్టు 

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్, పంజగుట్ట పరిధుల్లోని రెండు స్టార్‌ హోటల్స్‌పై శనివారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. వేర్వేరుగా వ్యభిచార దందాలు నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. తెలుగు సినీ, బెంగాలీ టీవీ రంగాలకు చెందిన ఇరువురిని రెస్క్యూ చేశారు. నిర్వాహకుడు కాస్టింగ్‌ డైరెక్టర్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. ముంబైకి చెందిన మోనిశ్‌ కపాడియా తెలుగు, హిందీ చిత్రాలకు కాస్టింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈవెంట్స్, ఫ్యాషన్‌ షోలు  నిర్వహించే ఇతను కొన్నేళ్లుగా వ్యభిచార దందా నిర్వా హకుడిగా మారాడు. నగరంలోని స్టార్‌ హోటళ్లలో వర్ధమాన హీరోయిన్లతో వ్యభిచారం నిర్వహిస్తుంటాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనార్దన్‌ అలియాస్‌ జానీ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న వ్యభిచార నిర్వాహకుడు. గుంటూరు జిల్లాకు చెందిన డి.వెంకట్‌రావును సహాయకుడిగా నియమించుకుని ఈ దందా నిర్వహిస్తున్నారు. 

వాట్సాప్‌ గ్రూపుల సాయంతో..
వీళ్లు వర్ధమాన హీరోయిన్లతో పాటు కొందరు టీవీ ఆర్టిస్టులనూ ముంబై, కోల్‌కతాల నుంచి రప్పిస్తున్నారు. మోనిశ్, వెంకట్‌ వేర్వేరుగా ‘కస్టమర్ల’తో కూడిన 40 నుంచి 50 వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా సినీ, టీవీ నటిని ఉచ్చులోకి దింపిన వెంటనే వారి ఫొటోలను వాట్సాప్‌లో కస్టమర్లకు షేర్‌ చేస్తుంటారు. వారి ఆసక్తి మేరకు ఆయా బాధితురాళ్లను విమానాల్లో తరలిస్తుంటారు. స్టార్‌హోటల్స్‌లో రూమ్స్‌ సిద్ధం చేసి లాబీల్లోనే కస్టమర్‌తో నగదు లావాదేవీలు పూర్తి చేస్తారు. కస్టమర్లకు హోటల్‌లో గది నంబర్‌ చెప్పి యాక్సిస్‌ కార్డు ఇచ్చి పంపిస్తుంటారు. ఒక్కో కస్టమర్ల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తుంటారు.

శుక్రవారం మోనిశ్‌ తెలుగు సినీ రంగానికి చెందిన ఓ వర్ధమాన హీరోయిన్‌ను బంజారాహిల్స్‌ పరిధిలో... శనివారం సిటీకి చేరుకున్న వెంకట్‌రావు బెంగాలీ టెలివిజన్‌ రంగానికి చెందిన నటిని పంజగుట్ట పరిధిలో ఉన్న హోటల్స్‌లో ఉంచి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్, కేఎస్‌ రవి తమ బృందాలతో రెండో హోటళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. మోనిశ్, వెంకట్‌రావులను అరెస్టు చేయడంతో పాటు ఇద్దరు బాధితురాళ్లను రెస్క్యూ చేశారు. వీరి నుంచి రూ.50 వేల నగదు, సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న జానీ కోసం గాలిస్తున్నారు. నిందితులిద్దరినీ రిమాం డ్‌కు, బాధితురాళ్లను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ల కాల్‌ డేటాతో పాటు వీటిలోని వాట్సాప్‌ గ్రూపుల్నీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరు నిర్వాహకుల కస్టమర్ల జాబితాలో సిటీకి చెందిన పలువురు వ్యాపారవేత్తలతో పాటు బడాబాబులూ ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ వివరాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకోలేమని, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటేనే అరెస్టుకు ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు