ఆరేళ్ల చిన్నారికి సవతి తండ్రి వేధింపులు

23 Feb, 2019 07:54 IST|Sakshi
బాలికను విచారిస్తున్న బాలల సంక్షేమ కమిటీ రాష్ట్ర సభ్యులు గాంధీ బాబు, ఆర్‌ఎంఓ డాక్టర్‌ పద్మశ్రీ తదితరులు

తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం క్రైం: ఆరేళ్ల పాపను సవతి తండ్రి వేధిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుజాత అనే మహిళ భర్త మృతి చెందడంతో తన ఆరేళ్ల కుమార్తెతో జీవనం సాగిస్తోంది. రాజవొమ్మంగికి చెందిన ఖలీఫ్‌ బర్కత్‌ అలీతో  కొంత కాలంగా రాజమహేంద్రవరం ఇన్నీసు పేటలో సహజీవనం సాగిస్తోంది. వీరిద్దరి సహజీవనానికి ఆరేళ్ల చిన్నారి అడ్డుగా ఉండడంతో బర్కత్‌ అలీ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.

ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం బర్కత్‌ అలీ బాలికపై ఆగ్రహంతో అట్లకాడ కాల్చి  ఒంటిపై పలుచోట్ల వాతలు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు ఛైల్డ్‌ లైన్‌కు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని బాధిత బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలల సంక్షేమ కమిటీ రాష్ట్ర సభ్యుడు వి.గాంధీ బాబు, ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్‌ పద్మశ్రీ,, అడిషనల్‌ డీఅండ్‌ఎంహెచ్‌ఓ డాక్టర్‌ కోమలి బాలికను పరిశీలించారు. పాప శరీరంపై కాలిన గాయాలు, మచ్చలు ఉన్నాయి. సంఘటనపై నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. బర్కత్‌ అలీపై టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. టూ టౌన్‌ సీఐ పవన్‌ కుమార్‌ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు