ఆస్తానా కేసు పూర్వాపరాలు..

23 Oct, 2018 08:55 IST|Sakshi
సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తానాపై (పాత చిత్రం)

సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తానాపై ఆ సంస్థే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజా పరిణామం నేపథ్యంలో ప్రధాని కార్యాలయం సోమవారం సీబీఐ డెరెక్టర్‌ అలోక్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తానాలకు సమన్లు జారీ చేసింది. సీబీఐ అత్యున్నత అధికారులిద్దరి మధ్య ఏడాది కాలంగా జరుగుతున్న అంతర్గత పోరాటం ఆస్తానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో తీవ్రరూపం దాల్చింది. దీన్ని పరిష్కరించడానికి ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిననున్నట్టు సమాచారం. ప్రధాని మోదీ గత ఏడాది అక్టోబర్‌ 22న ఆస్తానాను సిబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌గా స్వయంగా నియమించారు. గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఆస్తానాపై అప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్నందున ఆయన నియామకాన్ని సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. (సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌పై కేసు)

కేసు ఏమిటి?
మాసం ఎగుమతి వ్యాపారవేత్త అయిన ఖురేషి సీబీఐ కేసుల నుంచి బయటపడేస్తానని చెప్పి డైరెక్టర్ల తరఫున పలువురి నుంచి లంచాలు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హెదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్‌ తాను ఖురేషికి 3 కోట్లు లంచంగా ఇచ్చినట్టు మేజిస్ట్రేట్‌ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు నుంచి తనను బయటపడేయడానికి గత పది నెలల్లో దఫదఫాలుగా ఈ సొమ్ము ఇచ్చానని, తాజాగా అక్టోబర్‌ 9వ తేదీన 25 లక్షలు ఇచ్చానని సతీష్‌ చెప్పారు. సతీష్‌ తన వాగ్మూలంలో సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్తానా, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్‌ ప్రసాద్, ప్రసాద్‌ బంధువు సోమేశ్‌ల పేర్లు ప్రస్తావించారు. ఆస్తానా కోసమే ఈ సొమ్ము తీసుకుంటున్నట్టు ఖురేషి చెప్పారని కూడా  సతీష్‌ పేర్కొన్నారు. అయితే, ఆస్తానాను తాను ప్రత్యక్షంగా కలవలేదని స్పష్టం  చేశారు. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై కేసు నమోదు చేసింది. (సీబీఐ డీఎస్పీ అరెస్ట్‌)

ఎవరీ ఖురేషీ?
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మొయిన్‌ అక్తర్‌ ఖురేషీ డెహ్రాడూన్‌లోని డూన్‌ స్కూలు విద్యార్ధి. చదువయిపోయాకా 1993లో ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో చిన్న పశువధశాల ప్రారంభించాడు. అక్కడ నుంచి మాంసం ఎగుమతిదారుగా మారాడు. అనతి కాలంలోనే ఈ వ్యాపారంలో పేరు సంపాదించాడు. ఏళ్లు గడిచేకొద్ది  నిర్మాణం, ఫ్యాషన్‌ వంటి వివిధ రంగాలకు విస్తరించాడు.పాతిక కంపెనీలకు పైగా నెలకొల్పాడు. ఆయనపై అనేక పన్ను ఎగవేత కేసులు ఉన్నాయి. హవాలా వ్యాపారం ద్వారా కోట్లు గడించాడు. 

సీబీఐ మాజీ డైరెక్టర్లు రంజిత్‌ సింగ్, ఏపీ సింగ్‌ తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునేవాడు. వారి తరఫున సీబీఐ కేసుల్లో నిందితుల నుంచి ముడుపులు తీసుకునేవాడని ఈడీ ఆరోపించింది. ఖురేషీకి రాజకీయ ప్రముఖులతో కూడా సంబంధాలున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయం పన్ను శాఖలు ఖురేషీపై పలు కేసులు నమోదు చేశాయి. ఖురేషీపై ఉన్న కేసుల్లో దర్యాప్తు సాగకుండా సోనియా గాంధీ అడ్డుపడుతున్నారని 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. 

దేశం నుంచి అక్రమంగా 200 కోట్లను విదేశాలకు తరలించాడని ఖురేషీపై ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ, ఈడీ, ఆదాయం పన్ను శాఖల అధికారులు ఖురేషీ నివాసాల్లో  చేపట్టిన సోదాల్లో లభించిన డాక్యుమెంట్లు, సేకరించిన ఫోన్‌ సంభాషణల ఆధారంగా ఖురేషీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఖురేషీ కేసుల దర్యాప్తునకు ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. ఈ  కేసుతో సంబంధం ఉన్న సతీష్‌ను కేసు నుంచి తప్పించడం కోసం ఆస్తానా తరఫున ఖురేషీ 5.75 కోట్లు తీసుకున్నట్టు సీబీఐ కేసు నమోదు చేసింది.

సతీష్‌ వాంగ్మూలం
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్‌ వాంగ్మూలం ఆస్తానాపై కేసుకు ప్రాతిపదికగా మారింది. ఖురేషీ కేసులో నిందితుడిగా ఉన్న సతీష్‌ అక్టోబర్‌ 4న స్థానిక మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇస్తూ ఆస్తానా కోసం తాను ఖురేషీకి ఇంత వరకు 3 కోట్లు ఇచ్చానని చెప్పాడు. ఖురేషీ కేసులో విచారించడానికి సీబీఐ సెప్టెంబర్‌లో సతీష్‌కు సమన్లు పంపింది. ఆస్తానా ద్వారా ఈ సంగతి తెలుసుకున్న సతీష్‌ దుబాయ్‌ పారిపోవడానికి ప్రయత్నించాడు.అయితే,అప్పటికే సతీష్‌పై లుక్‌ ఔట్‌ నోటీసు జారీ కావడంతో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పట్టుకున్నారు.

మోదీకి ఇష్టుడు ఆస్తానా
ప్రధాని ఏరికోరి మరీ ఆస్తానాను సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌గా నియమించారు. 1984 గుజరాత్‌ ఐపీఎస్‌ కేడర్‌కు చెందిన ఆస్తానా అంతకు ముంద సీబీఐ అదనపు డైరెక్టర్‌గా పని చేశారు. గోధ్రా రైలు దహనం కేసులో సిట్‌కు నాయకత్వం వహించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ తదితర కేసుల దర్యాప్తుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆస్తానా అధిపతిగా వ్యవహరించారు. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తున్నారని భావించిన ఆస్తానా ఆయనపై పలు ఆరోపణలు చేశారు. తన విధి నిర్వహణలో అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ఖురేషీ కేసులో అలోక్‌ వర్మ లంచం తీసుకున్నారని కూడా ఆరోపించారు. వర్మపై 10 అవినీతిఆరోపణలతో కేబినెట్‌ కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఆయన ఈ వ్యవహరాన్ని విజిలెన్స్‌ కమిషన్‌కు అప్పగించారు.

ఆస్తానా పై కేసుకు దారి తీసిన పరిణామాలు:
కేసులోంచి తప్పించేందుకు లంచం ఇవ్వాలని ఆస్తానా డిమాండ్‌ చేశారంటూ హైదరాబాద్‌ వ్యాపారి సతీష్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆస్తానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దాంట్లో సీబీఐ అధికారి దేవేంద్ర కుమార్, మధ్యవర్తి మనోజ్‌ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్‌ ప్రసాద్‌ల పేర్లు, మరికొందరు ప్రభుత్వాధికారుల పేర్లు ఉన్నాయి.

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం... మనోజ్, సోమేశ్‌లు దుబాయ్‌లో సతీష్‌ను కలుసుకున్నారు. సీబీఐ అధికారి సహాయంతో సతీష్‌ కేసును సెటిల్‌ చేస్తామని వారు హామీ ఇచ్చారు.
సోమేశ్‌ తనతో సీబీఐ అధికారితో ఫోన్‌లో మాట్లాడించాడని, ఐదు కోట్లు ఇస్తే కేసును సెటిల్‌ చేస్తానని ఆ అధికారి చెప్పారని, ముందుగా 3 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలన్నారని సతీష్‌ ఆరోపించాడు. తనతో మాట్లాడింది రాకేశ్‌ ఆస్తానా అని సోమేశ్‌ చెప్పాడని కూడా సతీష్‌ పేర్కొన్నాడు. వాట్సాప్‌లో ఆస్తానా ఫోటో కూడా  చూపించాడని తెలిపాడు.
వారి మాటలు నమ్మి, కేసు నుంచి బయటపడాలన్న కోరికతో దుబాయ్‌లో మనోజ్‌ ప్రసాద్‌కు కోటి రూపాయలు ఇచ్చానని సతీష్‌ పేర్కొన్నాడు. తర్వాత సోమేశ్‌ చెప్పిన మేరకు ఢిల్లీలో సునీల్‌ మిట్టల్‌ అనే వ్యక్తికి 1.95 కోట్లు ఇచ్చానని సతీష్‌ వివరించాడు.

అధికారులకు 2.95 కోట్లు లంచం ఇచ్చినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ సతీష్‌కు నోటిసు పంపింది. దాంతో సతీష్‌ మనోజ్‌ను క లిసి లంచం ఇచ్చినా నోటీసులెందుకు వచ్చాయని నిలదీశాడు. మిగతా 2 కోట్లు ఇస్తే నోటీసు మాఫీ చేయిస్తానని మనోజ్‌ చెప్పాడు. గత నెల్లో సతీష్‌ హైదరాబాద్‌ నుంచి ఫ్రాన్స్‌ వెళ్లేందుకు ప్రయత్నించాడు. విమానాశ్రయం అధికారులు అతనిని వెళ్లకుండా ఆపారు. సెప్టెంబర్‌ 26న తమ ముందు హాజరు కావలసిందిగా సీబీఐ సతీష్‌ను ఆదేశించింది. అక్టోబర్‌ 1న సతీష్‌ ఢిల్లీలో సీబీఐ ముందు హాజరయ్యాడు. సీబీఐ డీఎస్‌పీ  దేవేంద్ర కుమార్, ఎస్‌పి జాగ్‌రూప్‌లను కలుసుకున్నాడు.
జరిగిందంతా సతీష్‌ మనోజ్‌కు చెప్పాడు.2 కోట్లు ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని మనోజ్‌ చెప్పడంతో త్వరలోనే ఇస్తానని చెప్పాడు. 

అక్టోబర్‌ 9వ తేదీన 2 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు.అనారోగ్యం వల్ల హాజరు కాలేకపోతున్నట్టు సతీష్‌ సీబీఐకి  మెయిల్‌ పెట్టాడు. తర్వాత సీబీఐ నుంచి సతీష్‌కు ఎలాంటి సందేశాలు రాలేదు. సతీష్‌ అక్టోబర్‌ 10న 25 లక్షలు మనోజ్‌కు ఇచ్చాడని, మిగతా సొమ్ము అక్టోబర్‌ 16న ఇవ్వాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే అక్టోబర్‌ 16న సొమ్ము తీసుకోవడానికి భారత్‌ వచ్చిన మనోజ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. దీని ఆధారంగా సీబీఐ ఆస్తానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.
-సాక్షి, నాలెడ్జ్‌సెంటర్‌

మరిన్ని వార్తలు