ఎంతపని చేశావు నాయనా!

8 Jul, 2020 13:38 IST|Sakshi
మూకల శ్రావణ్‌ కుమార్‌

ఇష్టంలేని గ్రూపు ఎంచుకోమన్నందుకు తనువు చాలించాడు

అదృశ్యమైన విద్యార్థి బావిలో శవమై తేలాడు  

బొండపల్లి: తనకు ఇష్టంలేని గ్రూపును ఎంచుకొని చదవమనందుకు ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చాడు. ఈ విషాద సంఘటన దేవుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై డి.సాయికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దేవుపల్లి గ్రామానికి చెందిన మూకల శ్రావణ్‌ కుమార్‌ (15) గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. కరోనా కారణంగా ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే ఇంటర్‌లో తనకు ఇష్టంలేని ఎంపీసీ గ్రూపును ఎంచుకొని తల్లిదండ్రులు చదవమన్నారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణ్‌కుమార్‌ ఈ నెల ఐదో తేదీ ఆదివారం నాడు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసును నమోదు చేసిన పోలీసులు విద్యార్థి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంతలో శ్రావణ్‌ కుమార్‌ దేవుపల్లి గ్రామ శివారు.. కోరాడ కృష్ణమూర్తికి చెందిన మామిడి తోటలో ఉన్న బావిలో శవమై తేలి ఉన్నట్టు వీఆర్వో నాగరాజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యార్థి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు రామారావు, కోండమ్మ, సోదరుడు ఉన్నారన్నారు. అదృశమైన కుమారుడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఎదురుచూశామని.. శవమై దర్శనమిస్తాడని అనుకోలేదని తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. 

>
మరిన్ని వార్తలు