విషాదం: ప్రిన్సిపాల్‌ కొట్టడంతో విద్యార్థి ఆత్మహత్య !

31 Jan, 2020 19:53 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం సారపాకలో ఓ విద్యార్థి శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. తేజ అనే విద్యార్థి స్థానిక ఎమ్‌ఎస్సార్‌ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి స్కూల్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉదయం పాఠశాలకు వెళ్లిన తమ కుమారుడు విగతా జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరవుతున్నారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కొట్టి చంపారని తేజ తల్లిదండ్రులు ఆరోపిస్తూ.. పాఠశాలలోని ఫర్నిచర్‌ను కుటుంబ సభ్యులు ధ్వంసం చేశారు.

స్కూల్‌లోనే తేజ మృతదేహంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈఘటన అనంతరం ప్రిన్సిపాల్‌  పరారయ్యాడు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్‌ ఫోర్స్‌ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక స్కూల్‌ యాజమాన్యం పాత్ర ఏమైనా ఉందా అనే కోణం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజ స్కూల్‌కు ఆలస్యంగా వచ్చాడని ప్రిన్సిపల్‌ రూ.50 ఫైన్‌ వేశారని తోటి విద్యార్థులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు