చదువుకుంటానంటే..పెళ్లి చేస్తున్నారని..

4 Oct, 2019 10:44 IST|Sakshi
మృతి చెందిన విద్యార్థిని లక్ష్మి 

సాక్షి, కొలిమిగుండ్ల(కర్నూలు) : బాగా చదువుకొని ప్రయోజకురాలు కావాలని కలలు కంటున్న తరుణంలో కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేయడంతో ఇష్టం లేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన బొంతల నరసింహరెడ్డి,అంకాళమ్మ దంపతుల కుమార్తె లక్ష్మి(18) అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కూతురు చదువుకుంటానని పదేపదే చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోకుండా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం నామనాయకపల్లెకు చెందిన 39 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. ఈ నెలాఖరున వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు.

అందులో భాగంగా బంగారం, ఇతర సరుకులు తెచ్చుకునే పనిలో ఉన్నారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని లక్ష్మి బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. చీకటి పడినా కూతురు ఇంటికి చేరక పోవడంతో తల్లిదండ్రులు తెలిసిన చోట్ల వాకబు చేసినా ఫలితం లేకపోయింది. అయితే గురువారం ఉదయం గీతాశ్రమం సమీపంలోని నీటికుంటకు దుస్తులు ఉతికేందుకు వెళ్లిన రజకులకు లక్ష్మి మృతదేశమ కనిపించింది. దీంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న హెడ్‌కానిస్టేబుళ్లు లక్ష్మినారాయణ,తిరుపాల్‌నాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

మరిన్ని వార్తలు