పగిడ్యాల : బీరవోలులో ప్రమాదవశాత్తు సైకిల్ మీద నుంచి జారిపడి ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి..గూడూరు గ్రామానికి చెందిన బోయ విజయుడు, నాగమణి దంపతుల కుమారుడైన రాంభూపాల్(13) అవ్వతాత ఊరైన బీరవోలులో ఉంటూ నందికొట్కూరు జీవనజ్యోతి పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాల వెళ్లి వచ్చిన రాంభూపాల్ సాయంత్రం సరదాగా సైకిల్ తొక్కడానికి పగిడ్యాలలోని మోడల్ పాఠశాల మైదానంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో సైకిల్ నుంచి ప్రమాదావశాత్తు జారిపడిపోయాడు.
ఘటనలో నడుముకు తీవ్రగాయాలు కావడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన మోడల్ స్కూల్ విద్యార్థులు బాలుడి అవ్వతాతలకు సమాచారం అందించారు. వారు వెంటనే అతడిని నందికొట్కూరుకు తరలించారు. వైద్యుల సూచనల మేరకు కర్నూలు రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స ఫలించకపోవడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.