9వ తరగతి విద్యార్థి మృతి
వెంకటగిరిలో చోటుచేసుకున్న విషాద ఘటన
నెల్లూరు , వెంకటగిరి: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన 9వ తరగతి విద్యార్థి పఠాన్ పండు (14) ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పఠాన్ తల్లిదండ్రులు చనిపోవడంతో తాత ఖాజా సంరక్షణలో ఉంటున్నాడు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం పాఠశాలకు వెళుతున్నట్లు తాతకు చెప్పి బయలుదేరాడు.
సాయంత్రమైనా అతను ఇంటికి రాకపోవడంతో రాత్రి ఖాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం ఉదయం స్థానిక అమ్మవారిపేట చెరువులో ఓ బాలుడి మృతదేహం ఉందని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు పఠాన్ కుటుంబసభ్యులకు చెప్పడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పఠాన్దిగా గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం పఠాన్తోపాటు తోటి విద్యార్థులు ఈత కోసం చెరువు వద్ద వెళ్లారు. పఠాన్ చెరువులోని గోతుల్లో ప్రమాదవశాత్తు చిక్కుకోవడం, ఈత రాకపోవడంతో మునిగిపోయి మృతిచెందడంతో స్నేహితులు భయపడి ఎవరికీ చెప్పలేదని చెబుతున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.