విద్యార్థి ఉసురు తీసిన ఈత సరదా

27 Jan, 2020 12:29 IST|Sakshi
బాక్స్‌లో ఇమ్మానియేలు మృతదేహం

ప్రకాశం, ఉలవపాడు: సరదాగా మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండల పరిధిలోని భీమవరం ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గౌడపేరు ఇమ్మానియేలు (19) ఒంగోలులోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడే డీఏ పాలిటెక్నిక్‌ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. సెలవులకు స్వగ్రామం భీమవరం వచ్చాడు. ఆదివారం చర్చికి వెళ్లి వచ్చి 10 మంది మిత్రులతో కలిసి భీమవరంలోని చెరువుకు ఈతకు వెళ్లాడు.

ఈత కొడుతూ లోతుకు వెళ్లాడు. చెరువులో జేసీబీతో గతంలో తీసిన గుంతలు ఉన్నాయి. ఆ గుంతల్లోకి వెళ్లిపోయాడు. తోటి మిత్రులు వెళ్లి పక్కనే ఉన్న గ్రామస్తులను తీసుకొచ్చేలోపు మృతి చెందాడు. చేతికి అందివచ్చే సమయంలో కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి గౌడపేరు శేషయ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఈతకు వెళ్లి మృతి చెందడంతో బంధువుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు