ఉన్నత చదువు కోసం వచ్చి.. అసువులు బాసి..

12 Sep, 2018 07:57 IST|Sakshi
విద్యుత్‌ తీగలను ఆనుకుని నిర్మించిన ఇళ్లు శ్రీరామ్‌ (ఫైల్‌)

విద్యుదాఘాతంతో డిగ్రీ విద్యార్థి దుర్మరణం  

మృతుడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వాసి

నల్లకుంట: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ టెర్రస్‌పైకి వెళ్లిన ఓ విద్యార్థికి విద్యుత్‌ తీగలు తగలడంతో మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై మహేందర్‌ కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన శ్రీనివాస్‌ కుమారుడు శ్రీరామ్‌ (19) ఉన్నత చదువుల కోసం నెలరోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. విద్యానగర్‌లోని హిందీ మహావిద్యాలయలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాడు. కళాశాలకు దగ్గరగా ఉంటుందని స్నేహితులు అభిలాష్, సాయిచరణ్‌లతో కలిసి నల్లకుంట రైల్వే ట్రాక్‌ సమీపంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు.

సోమవారం సాయంత్రం శ్రీరామ్‌కు ఎవరో ఫోన్‌ చేయడంతో మాట్లాడుతూ ఇంటి టెర్రస్‌పైకి వెళ్లాడు. అదే సమయంలో ఆ బిల్డింగ్‌ పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలు (రైల్వేకి చెందిన) అతనికి తాకడంతో మంటలు అంటుకున్నాయి. గదిలో ఉన్న శ్రీరామ్‌ స్నేహితులు టెర్రస్‌పైకి వెళ్లి చూడగా స్నేహితునికి మంటలు అంటుకుని శరీరం కాలిపోయింది. వెంటన్‌ 108 ఫోన్‌ చేయగా అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆస్పత్రికి (డీడీహెచ్‌)కి తరలించారు. అక్కడ చికిత్సలు పొందుతున్న సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు