దయచేసి హాస్టల్స్‌లో ఒంటరిగా ఉండొద్దు..!

13 Jul, 2019 15:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సీటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం జిల్లావాసిగా గుర్తింపు

చంఢీగడ్‌/అనంతపురం : పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సీటీలో ఓ తెలుగు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవ్యక్తిగా గుర్తించారు. మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్యకు పాల్పడినట్టు విద్యార్థి రాసిన సూసైడ్‌ నోట్‌ వల్ల తెలుస్తోంది. ఒంటరి జీవితాన్ని ముగిస్తున్నానని విద్యార్థి లేఖలో పేర్కొన్నాడు. సూసైడ్‌ నోట్‌ ప్రకారం.. ‘ఇక సెలవు. వెళ్లిపోతున్నాను. మిమ్ములనందరినీ వదిలిపెట్టి. నా చావుకు నేనే కారణం. నా ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎవరైనా నావళ్ల ఇబ్బంది పడుంటే సారీ, దయచేసి హాస్టల్స్‌లో ఉన్నప్పుడు రూమ్‌లలో ఒంటరిగా ఉండకండి.

రోజుకి కనీసం గంటైనా ఆడుకోవటానికి వెళ్లండి. రిలాక్స్‌ కావడానికి అదే మంచి మార్గం. లేకుంటే నాలాగే సూసైడ్‌ ఆలోచనలు వస్తాయి. సూసైడ్‌ చేసుకునే వారిని పిరికివాళ్లుగా తీసిపారేయకండి. ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం వందేళ్లు బతికినా రాదు. అంతకష్టం సూసైడ్‌ చేసుకోవడం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. మా అమ్మానాన్నల గురించి చెప్పాలంటే, నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించే గొప్పవాళ్లు. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాళ్లు. పాపం వారెలా తట్టుకుంటారో నేను చనిపోయానని తెలిసి.

నా రియల్‌ లైఫ్‌లో జగదీష్‌ అంత దానకర్తని చూడలేదు. చిన్నప్పటినుంచి మా అన్నవాళ్లు కూడా సపోర్టు చేస్తూ వచ్చారు. ఇంక మీరే అమ్మానాన్నని బాగా చూసుకోవాలి. ఇంక చెప్పడానికేం లేదు. నా ప్రాణస్నేహితులకు, మిత్రులకు, శత్రువులకు, బంధువులందరికీ నా జీవితంలో మీరూ భాగమైందుకు కృతజ్ఞతలు. నాకు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేదు. గుడ్‌బై. వీలైతే మరణానంతరం నా అవయవాలు దానం చేయండి’అని ముగించాడు. ఇక విద్యార్థి మృతదేహాన్ని సొంతూరికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు