విద్యార్థి అదృశ్యం

24 Feb, 2020 10:35 IST|Sakshi
పోస్టర్‌ను విడుదల చేస్తున్న పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ నరసింహారావు, సీఐ మహేశ్‌ , జీవన్‌రెడ్డి(ఫైల్‌)

పోలీసుల్లో కలవరం..

70 సీసీ కెమెరాల పుటేజీ పరిశీలన..

ఆధారాలు దొరక్క పోవడంతో పోస్టర్ల ద్వారా ప్రచారం  

కుత్బుల్లాపూర్‌: ఓ విద్యార్థి అదృశ్యం పోలీసులను ఆందోళనకు గురి చేసింది..అదృశ్యమైన విద్యార్థి కోసం పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు 13 రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ నరసింహారావు, సీఐ మహేశ్‌ ఆదివారం విద్యార్థి జీవన్‌రెడ్డి పోస్టర్‌ను విడుదల చేసి బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, ప్రధాన కూడళ్లలో అంటించి, ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే..నల్గొండ జిల్లా సిద్దార్థ కాలనీకి చెందిన జీవన్‌రెడ్డి  మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 11న కాలేజీకి వెళ్లిన జీవన్‌రెడ్డి తిరిగి రాలేదు. అతడి తండ్రి ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన సీఐ మహేశ్‌ అతని ఆచూకీ కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఇదిలా ఉండగా సదరు విద్యార్థి ప్రవర్తనపై పోలీసులు ఆరా తీయగా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడేవాడని తెలిసింది. దీంతో అతడితో చనువుగా ఉండే వారిపై కూడా నిఘా పెట్టారు. ఎల్బీనగర్, ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్, జేబీఎస్, సుచిత్ర, తదితర ప్రాంతాల్లోని 70 సీసీ కెమెరాలను పరిశీలించినట్లు సీఐ మహేశ్‌ ‘సాక్షి’ కి తెలిపారు. మరిన్ని ప్రాంతాల్లో ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్‌ను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు