విద్యార్థిని అదృశ్యం

21 Jan, 2020 10:44 IST|Sakshi
నందిని(ఫైల్‌)

టేక్మాల్‌(మెదక్‌): విద్యార్థిని అదృశ్యమైన సంఘటన టేక్మాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుసంగి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని కుసంగి గ్రామానికి చెందిన కుమ్మరి రామమ్మ కూతురు నందిని(16) సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఓ ప్రయివేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుకుంటుంది. ఈనెల 18వ తేదీన వాళ్ల అమ్మమ్మ పెంటమ్మతో కలిసి మధ్యాహ్న సమయంలో గ్రామ సమీపంలో ఉన్న పొలం వద్దకు వెళ్లారు. అక్కడ ఇరువురు పనులు చేస్తుండగా నందిని దాహం వేస్తుందని దగ్గరలో ఉన్న గుడిసెలో నీళ్లు తాగేందుకు వెళ్లింది. నీళ్లు తాగేందుకు వెళ్లిన నందిని తిరిగి రాలేదు. సాయంత్రం రామమ్మ కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి కూతురు ఇంటి వద్ద లేకపోవడంతో ఇరుగుపొరుగు వాళ్ల ఇళ్లలో, బంధువుల వద్ద వెతికారు. నందిని ఆచూకి లభించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నందిని చామన్‌ఛాయ రంగులో ఉండి లేత ఆకుపచ్చ లాంగ్‌ ప్రాక్‌ డ్రెస్‌ వేసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు