పరీక్షల బెంగతో విద్యార్థి ఆత్మహత్య

22 Feb, 2018 11:06 IST|Sakshi
మృతి చెందిన విద్యార్థి భానుప్రకాష్‌

ఎంత చదివినా మార్కులు రావడం లేదని ఆవేదన

తల్లిదండ్రులు సర్దిచెప్పినా ఫలితం శూన్యం

పీలేరు : మండలంలోని తలపుల పంచాయతీ జంగంపల్లెలో చెరువులో దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జంగంపల్లెకు చెందిన జి.ఎం.కృష్ణయ్య, రేణుక దంపతుల పెద్ద కొడుకు భానుప్రకాష్‌ (15) తలపుల హాస్టల్‌లో ఉంటూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఎంత చదివినా పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తున్నాయని నెల రోజులుగా మథనపడే వాడు. మరింత కష్టపడితే పబ్లిక్‌ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని తల్లిదండ్రులు ధైర్యం చెప్పేవారు. మంగళవారం సాయంత్రం పాఠశాలలో సంకల్పం కార్యక్రమంలో భాగంగా సోషియల్‌ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో భానుప్రకాష్‌తోపాటు అతని స్నేíßహితుడు బిట్లను చూసి రాసినట్టు గుర్తించిన ఉపాధ్యాయుడు ఇద్దరినీ మందలించారు. ఇలా చేయడం వల్ల పబ్లిక్‌ పరీక్షల్లో పట్టుబడితే డిబార్‌ అవుతారని హెచ్చరించారు. మరింత కష్టపడితే మంచి మార్కులు వస్తాయని వివరించారు. ఈ విషయాన్ని భానుప్రకాష్‌ తండ్రి కృష్ణయ్యకు ఉపాధ్యాయుడు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడు.

మార్కులు తక్కువ వస్తున్నాయని..
ఎంత చదివినా పాఠ్యాంశాలు గుర్తుండకపోవడం, మార్కులు తక్కువగా వస్తుండడంతో ఆవేదన చెం దాడు. స్కూల్‌ నుంచి హాస్టల్‌కు వెళ్లిన భానుప్రకాష్‌ హాస్టల్‌లో పుస్తకాల బ్యాగు పెట్టి ఎక్కడికో వెళ్లి పోయాడు. భానుప్రకాష్‌ కనిపించడం లేదన్న విషయాన్ని హాస్టల్‌ ఇన్‌చార్జి వార్డెన్‌కు పిల్లలు తెలి పారు. ఆందోళనకు గురైన వార్డెన్‌ వెంటనే విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిసర గ్రామాలు, బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లేదు. బుధవారం సాయంత్రం హాస్టల్‌ సమీపంలోని గోవిందరెడ్డి చెరువులో విద్యార్థి మృతదేహం తేలడాన్ని స్థానికులు గుర్తించారు. విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు, బంధువులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పీలేరు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి  విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి మృతిపై తలపుల హెచ్‌ఎం బాబురెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టపడి చదివి ఉద్దరిస్తాడనుకున్న కొడుకు అకాలమరణంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.

మరిన్ని వార్తలు