విద్యార్థిని బలవన్మరణం

15 Jun, 2019 08:57 IST|Sakshi

సాక్షి, ఎమ్మిగనూరు(కర్నూలు) : మండల పరిధిలోని పార్లపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బోయ రంగస్వామి, చక్రమ్మల కూతురు రాజేశ్వరి(15) ఇటీవల పదో తరగతి పాస్‌ అయింది. తోటి స్నేహితులతో కలిసి కర్నూలులోని ప్రైవేట్‌ కళాశాలలో చేర్పించాలని తండ్రిని కోరగా, ఆర్థిక పరిస్థితి బాగోలేదని సర్ధిచెప్పాడు. దీంతో కడివెళ్ల ఏపీ మోడల్‌ స్కూల్‌లో గురువారం దరఖాస్తు చేసి వచ్చింది.

అక్కడ తోటి విద్యార్థినులు ప్రైవేటు కాలేజీలో చేరుతున్నట్లు చెప్పడంతో మరోసారి తండ్రితో ప్రస్తావించింది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే తాను అంత ఫీజు కట్టలేనని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురై రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లిదండ్రులు ఉదయం నిద్రలేచేసరికి కూతురు ఫ్యాన్‌కు వేలాడుతుండటం చూసి గుండెలు పగిలేలా రోదించారు. రూరల్‌ ఏఎస్‌ఐ నాయక్‌ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు