తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు

23 Jun, 2018 11:12 IST|Sakshi
స్కూల్లో ఊరేసుకొని విద్యార్థి ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల మరణాలు 

సాక్షి, గుంటూరు/హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి.  హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఓ కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు విడిచాడు. హాస్టల్‌ పైనుంచి దూకి ప్రాణాలు వదిలాడు. ఇటు గుంటూరు పిడుగురాళ్లలో ఎనిమిదో తరగతి విద్యార్థి పాఠశాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

హైదరాబాద్‌లో..
కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లోని చైతన్య కాలేజ్‌లో రెండో సంవత్సరం చదుతువుతున్న అభికుమార్ రెడ్డి అనే విద్యార్థి హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో హాస్టల్‌ భవనం ఐదో అంతస్తు నుంచి అతను దూకేశాడు. అతని స్వస్థలం కృష్ణా జిల్లా కే.రామచంద్రాపురం. అభికుమార్‌ ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. అభికుమార్‌ మృతి పట్ల అతని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదో అంతస్తు నుంచి దూకినా.. కాలి మీద చిన్న దెబ్బ తప్ప.. గాయాలు కాలేదని అంటున్నారు. చదువు చెప్పమని పంపిస్తే తన కొడుకును శవంగా మార్చేసారని కాలేజీ యాజమాన్యం తీరుపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ వేధింపుల కారణంగానే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

గుంటూరులో..
 జిల్లాలోని పిడుగురాళ్ల మండలం లెనిన్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంసది. లెనిన్‌ నగర్‌లో ఉన్న మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్ కుమార్ అనే విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం అతను ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. శనివారం తాను చదువుతున్న పాఠశాలలోనే అతను ఉరేసుకొని కనిపించాడు. ఈ ఘటనతో అశోక్‌కుమార్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వార్తలు