ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం

14 Dec, 2018 13:26 IST|Sakshi

చెన్నై: తోటి విద్యార్థులు హేళన చేయడంతో ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన తమిళనాడులోని విలుపురం జిల్లాలో వెలుగు చూసింది. 12 ఏళ్లు దాటని ఐదుగురు విద్యార్థినులు ఒకేసారి ఆత్మహత్యకు ప్రయత్నించడం తమిళనాడులో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. విలుపురం జిల్లా అరసంపట్టు ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో బాధిత విద్యార్థినులు 7వ తరగతి చదువుతున్నారు. అయితే వారితో పాటు చదువుతున్న ఓ విద్యార్థి తరగతి గదిలోని బోర్డుపై ఐ లవ్యూ అని రాసి ఐదుగురు విద్యార్థినుల పేర్లు రాశాడు. ఈ విషయమై మిగిలిన విద్యార్థులు సదరు విద్యార్థినులపై హేళనగా మాట్లాడారు. 

దీనిని అవమానంగా భావించిన ఆ విద్యార్థినులు.. పాఠశాల ఆవరణలోనే విషం తాగారు. దీనిని గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే వారిని కల్లకుర్చి ఆస్పత్రికి తరలించారు. బాధితులకు సకాలంలో వైద్యం అందడంతో వారు ప్రాణాలతో బయటపడినట్టుగా వైద్యులు తెలిపారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 

మరిన్ని వార్తలు