ఆత్మహత్యాయత్నం వీడియో కలకలం 

30 Sep, 2018 03:11 IST|Sakshi

సీఐ చితకబాదడంతో మనస్తాపం చెందిన యువకుడు

ధర్మసాగర్‌ (స్టేషన్‌ఘన్‌పూర్‌): వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం వీడియో కలకలం సృష్టించింది. భూ వివాదంలో సీఐ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చేయిచేసుకోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శనివారం సెల్ఫీ వీడియో చిత్రీకరించి వాట్సాప్‌ గ్రూపులో పోస్ట్‌ చేశాడు. ధర్మసాగర్‌ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన జక్కుల సుధీర్, ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి భర్త రమణారెడ్డికి కొన్నేళ్లుగా ఓ భూమి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలుమార్లు గొడవలు జరిగాయి.

ఈ విషయంలో శనివారం ఉదయం ధర్మసాగర్‌ సీఐ శ్రీలక్ష్మి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తనను కొట్టిందని మనస్తాపం చెంది రైల్వేట్రాక్‌పై సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశాడు. ఆ తర్వాత సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నాడు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు 100కు డయల్‌ చేసి, జీఆర్పీ పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అతడి ఆచూకీ కోసం ఆరా తీయగా జమ్మికుంట మండలం మడిపల్లిలోని తన బాబాయి కొడమల్ల సదయ్య ఇంట్లో ఉన్నట్లు గుర్తించి తీసుకువచ్చి తండ్రికి అప్పగించారు. ఆత్మహత్యాయత్నం చిత్రీకరించిన వీడియోలోని యువకుడు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

మరిన్ని వార్తలు