పెళ్ళైన ఆరు నెలలకే..!

3 Nov, 2019 11:17 IST|Sakshi
వెంకటదుర్గ, భర్త శ్రీనివాసరావు పెళ్లి ఫొటో

వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్య

భర్త, అత్తమామలే కారణమని యువతి తల్లిదండ్రుల ఆరోపణ 

సాక్షి, తాడేపల్లి రూరల్‌: పెళ్ళైన ఆరు నెలలకే అత్తమామలు, కట్టుకున్న భర్త, తోడికోడళ్ల వేధింపులకు ఓ యువతి ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. అత్తమామలు, భర్త వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ యువతి తల్లి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లి పట్టణ పరిధిలోని పాత టోల్‌గేట్‌ ఎదురు రోడ్డులో నివాసం ఉంటున్న తాడిగడప శ్రీనివాసరావు గతంలో విజయవాడలోని పడమటలంకలో ఉండేవాడు. ఆరు నెలల కిందట అదే ప్రాంతంలో నివాసం ఉండే చీమలదిండి కొండయ్య, మల్లేశ్వరిల కుమార్తె వెంకటదుర్గ (20)ను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం తాడేపల్లికి కాపురాన్ని మార్చాడు. ఇక్కడకు వచ్చినప్పటి నుంచి తక్కువ కట్నం ఇచ్చారు.. ఇస్తామన్న నెక్లెస్‌ ఇవ్వలేదంటూ  వెంకటదుర్గను భర్త శ్రీనివాసరావు, అత్తమామలైన దుర్గారావు, లక్ష్మి, తోడికోడలు తరచు వేధించడం మొదలెట్టారు.

శ్రీనివాసరావు కూడా కొట్టడంతో తల్లిదండ్రులకు కష్టాన్ని వివరించింది. శుక్రవారం రాత్రి శ్రీనివాసరావు ఫోన్‌ చేసి ‘నీ కూతురును తీసుకువెళ్లాలని.. ఒక గంటలో రాకపోతే చంపుతామని బెదిరించి’నట్లు మల్లేశ్వరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే కదా అని మల్లేశ్వరి తాడేపల్లికి రాలేదు. ఉదయం కల్లా తన కూతురు చనిపోయిందని చెప్పారని, వెంటనే తాడేపల్లి వచ్చి చూడగా కింద పడుకోబెట్టారని కన్నీరుమున్నీరైంది. అత్తమామలు, భర్త వేధింపుల వల్లే తన కూతురు ఉరి వేసుకొని చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మార్వో సమక్షంలో పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి సీఐ అంకమ్మరావు తెలిపారు.

మరిన్ని వార్తలు