సునంద పుష్కర్‌ మిస్టరీ.. ఆ గదిని అప్పగించారు

16 Oct, 2017 19:11 IST|Sakshi
సునంద పుష్కర్‌ (ఫైల్‌)

సాక్షి, న్యూఢిల్లీ : లీలా ప్యాలెస్‌ హెటల్‌ యాజమాన్యానికి ఎట్టకేలకు ఊరట లభించింది. సునంద పుష్కర్‌ మృతి కేసులో ఆ హోటల్‌లోని గదిని దాదాపు నాలుగేళ్లుగా సీల్‌ చేసి ఉంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం గదిని తెరిచి హోటల్‌ యాజమాన్యానికి అప్పగించారు.  

2014 జనవరి 17న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌(51) హోటల్‌ గది నంబర్‌ 345లో అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, ఏడాది దర్యాప్తు అనంతరం ఆమెకు విషమిచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించసాగారు. ఆమె చనిపోయిన నాటి నుంచే ఆ గదిని సీల్‌ చేసి తమ ఆధీనంలోఉంచుకున్నారు. విచారణ పేరిట తరచూ హోటల్‌కు వెళ్లి ఆ గదిని పరీశించారు కూడా.

అయితే మూడేళ్లుగా ఇలా గదిని మూసేయటం ద్వారా గది పాడైపోయిందని.. పైగా అది వ్యాపారం మీద కూడా ప్రభావం చూపుతోందని హోటల్‌ యాజమాన్యం ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఆర్థికంగా కూడా తమకు చాలా నష్టం కలిగిందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో అక్టోబర్‌ 10న ఈ పిటిషన్‌ విచారణకు రాగా.. గదిని తిరిగి హోటల్‌కు అప్పగించేయాలని ఆరు రోజుల గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  దర్యాప్తు దాదాపు పూర్తయి పోవటం.. ఇప్పటికే సాక్ష్యాలు సేకరించటంతోపాటు... ఎలాగూ ఫోరెన్సిక్‌ తుది నివేదిక త్వరలో రానున్న నేపథ్యంలో ఇంకా హోటల్‌ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో దాదాపు మూడున్నరేళ్ల తర్వాత మూసిన తలుపులను తెరిచారు.

మరిన్ని వార్తలు