ఐటీసీ పీఎస్‌పీడీలో విదేశీ ఇంజనీర్‌ మృతి

14 Jul, 2018 11:24 IST|Sakshi
ఫిన్లాండ్‌ ఇంజనీర్‌ మృతదేహం 

బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో ఫిన్లాండ్‌కు చెందిన స్టార్టప్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... ఐటీసీ పీఎస్‌పీడీలో నూతన యంత్రాలను అమర్చేందుకు వచ్చిన ఫిన్లాండ్‌కు చెందిన స్టార్టప్‌ ఇంజనీర్‌ విజో కలెవి కొర్హనన్‌(55), శుక్రవారం ఉదయం తనకు కేటాయించిన వసతి గదిలో మృతిచెందాడు. ఇతడు జూన్‌ 16నఆర్‌ఏటీఆర్‌ కన్సల్టెన్సీ నుంచి  చెన్నైకి చెందిన వాలెట్‌ కంపెనీ తరఫున ఐటీసీ పీఎస్‌పీడీలో నూతన యంత్రాల అమర్చేందుకు వచ్చాడు.

అతనికి ఐటీసీ పీఎస్‌పీడీలో బ్యాచిలర్‌ క్వార్టర్స్‌లో రూమ్‌ నెంబర్‌ 122ను అధికారులు కేటాయించారు. ఆయన రోజు మాదిరిగానే గురువారం సాయంత్రం విధులు ముగించుకుని క్యాంటీన్‌లో డిన్నర్‌ చేసి రూమ్‌కు వెళ్లాడు. శుక్రవారం ఉదయం గది తలుపులు తీయలేదు. అక్కడి వర్కర్లు ఇచ్చిన సమాచారంతో వాలెట్‌ కంపెనీ ప్రతినిధులు వెళ్లారు. గది తలుపులు పగలగొట్టి చూసేసరికి మంచంపై విగతుడిగా పడున్నాడు. నోటి వెంట నురగు వస్తోంది.

అతని మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ గదిని పాల్వంచ సీఐ రాఘవేంద్రరావు, బూర్గంపాడు ఎస్‌ఐ సంతోష్‌ పరిశీలించారు. మృతుడు విదేశీయుడవడంఓ ఎస్పీకి తెలిపారు. విదేశాంగ శాఖ ప్రతినిధులకు  జిల్లా ఎస్పీ అంబర్‌కిషోర్‌ ఝా సమాచారమిచ్చారు. మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. వాలెట్‌ కంపెనీ ఇంజనీర్‌ సంతోష్‌ తివారీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు