ఇంట్లో చెప్పకుండా వెళ్లి... బావిలో శవమై తేలి..!

22 Jun, 2018 12:40 IST|Sakshi
బావిలో తేలియాడుతున్న మహిళ మృతదేహం 

కేతేపల్లి(నకిరేకల్‌) : కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మూడు రోజుల కిత్రం ఇంటి నుంచి వెళ్లిన మహిళ వ్యవసాయం బావిలో శవమై తేలింది. ఈ సంఘటన కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామంలో గురువారం జరిగింది. కేతేపల్లి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామానికి చెందిన మౌనిక(28)కు, కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన కొండ క్రిష్ణతో పదే ళ్ల కిత్రం వివాహమైంది.

వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. క్రిష్ణ సూర్యాపేట ఆంధ్రబ్యాం కు శాఖ తరఫున గ్రామంలో బ్యాంకుమిత్రగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో నాలుగు రోజుల కిత్రం క్రిష్ణ గ్రామానికి చెందిన బ్యాంకు ఖాతా దారులకు చెల్లించేందుకు çసూర్యాపేట బ్యాంకు నుంచి దా దాపు రూ.2లక్షలను తీసుకొచ్చి ఇంట్లో దాచాడు. ఈవిషయం తెలియని ఆయన భార్య మౌనిక ఇంటి తలుపులు వేయకుండానే పక్కనే ఉన్న ఇరుగుపొరుగు వారి ఇంటికి వెళ్లింది.

ఊళ్లోకి వెళ్లి ఇంటికి వచ్చిన క్రిష్ణకు తలుపులు బార్లాగా తెరిచి ఉండడంతో పాటు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భార్య మౌనికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన మౌనిక ఈ నెల 19న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. మౌనిక ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెదికినా ఫలితం లేకపోవడంతో క్రిష్ణ తన భార్య కనిపించడం లేదంటూ ఈనెల 20న కేతేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉండగా మూడు రోజుల కిత్రం కనిపించకుండా పోయిన మౌనిక గురువారం స్థానికంగా చౌళ్లగూడెం వెళ్లే దారిలో రైతు సత్తిరెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో శవమై లేలింది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు కేతేపల్లి పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీయించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని కేతేపల్లి ఎస్‌ఐ రజనీకర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు