అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

19 Jul, 2018 14:54 IST|Sakshi
శైలజ మృతదేహం మృతురాలి పిల్లలు 

దంతాలపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో బుధవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన అన్నవరపు శ్రీను కుమార్తె శైలజ(28)కు పెద్దముప్పారం గ్రామానికి చెందిన ధర్మారపు యాకయ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించాడు.

శైలజ ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, యాకయ్య ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య మనస్పర్థలతో తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి కూడా గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున శైలజ మృతి చెందిందని వెల్లడించారు.

మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారంతో సీఐ చేరాలు, ఎస్సై నందీప్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధించి యాకయ్యే హత్య చేశాడని మృతురాలి తండ్రి శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేయగా,  కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు