ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని మనస్తాపం
ప్రేమించిన యువకునితో వివాహానికి పెద్దల నిరాకరణ
యువతి మరణాన్ని తట్టుకోలేక సోదరుడు ఆత్మహత్యాయత్నం
సాక్షి, వి.కోట: అనుమానాస్పద స్థితిలో యువతి చెరువులో శవమై తేలిన సంఘటన మండలంలోని జేబీ కొత్తూరులో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం..మండలంలోని జేబీ కొత్తూరుకు చెందిన హరి కుమార్తె రాణి(18) మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె కుటుంబ సభ్యులు వి.కోట పోలీస్టేషన్లో ఇదే విషయమై ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జేబీ కొత్తూరు చెరువులో యువతి శవం తేలుతుండటం గ్రామస్తులు గమనించా రు. అది రాణి మృతదేహమని గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. సీఐ యతీంద్ర తన సిబ్బందితో చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. రాణి మృతిపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇటీవల రాణికి కుటుంబ సభ్యులు ఓ వ్యక్తితో వివాహం నిశ్చయించారు.
అయితే ఆ వ్యక్తితో తనకు వివాహం ఇష్టం లేదని, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని తాను ప్రేమిం చానని, అతనితో తనకు వివాహం చేయాలని కుటుం బ సభ్యులను కోరింది. దీనికి వారు అంగీకరించలేదు. దీంతో నచ్చని వ్యక్తి ఇచ్చి పెళ్లి చేస్తుండడంతో యువతి ఆత్మహత్య చేసుకుందా, మరెవరైనా యువతిని హతమార్చి చెరువులో పడేశారా? అనే కోణంలో పోలీ దర్యాప్తు చేస్తున్నారు. ఇదలా ఉంచితే, మృతురాలి తండ్రికి ఇద్దరు భార్యలున్నారు. రాణి మొదటి భార్య కుమార్తె. రాణి మరణవార్త విని తట్టుకోలేక రాణికి అన్న వరుసైన గణేష్ (హరి రెండో భార్య కుమారుడు) ఎలుకల మందు పుచ్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం చర్చనీయాంశమైంది. వి.కోట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం అతడిని కుప్పం పీహెచ్సీకి తరలించారు. యువతి మృతిపై సీఐ దర్యాప్తు చేస్తున్నారు.