కైలాసం పూర్తయింది! 

24 Feb, 2020 09:38 IST|Sakshi

సాక్షి, చెన్నై: పరారీలో ఉన్న స్వామి నిత్యానంద తాజా వీడియో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని అతడు చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తోంది. కాగా స్వామి నిత్యానందపై బెంగళూరుకు చెందిన జనార్దన్‌ శర్మ గుజరాత్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందులో శర్మ తన ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్‌ చేసి అహ్మదాబాద్‌ ఆశ్రమంలో నిర్బంధించారంటూ చేసిన ఫిర్యాదుతో నిత్యానందపై కిడ్నాప్‌ కేసు నమోదైంది. 

వరుస కేసుల క్రమంలో నిత్యానంద విదేశాలకు పరారయ్యాడు. కిడ్నాప్‌ కేసులో గుజరాత్‌ పోలీసులు అంతర్జాతీయ పోలీసుల (ఇంటర్‌పోల్‌) సాయం కోరారు. అయినప్పటికీ అతను ఉన్న ప్రాంతాన్ని గుర్తించలేకపోయారు. ఇలావుండగా నిత్యానంద వెల్లడించినట్లుగా ఒక కొత్త వీడియో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అందులో నిత్యానంద కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని వెల్లడించాడు. తాను మృతి చెందితే తన భౌతికకాయాన్ని బిడది శ్రమంలో ఖననం చేయాలని, అదే తన చివరి ఆశ అని అందులో తెలిపాడు. కాగా నిత్యానంద ఈక్వెడార్‌ సమీపం కైలాసం పేరుతో కొత్త దీవిని ఏర్పాటుచేసి స్వత్రంత్ర దేశంగా రూపొందించే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డ విషయం విదితమే. 

మరిన్ని వార్తలు