మాయ మాటలు చెప్పి.. ఐదేళ్ల చిన్నారిపై

14 Aug, 2019 15:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ: ఐదేళ్ల చిన్నారిపై పలుమార్లు అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసిబాలిక అని కూడా చూడకుండా పాఠశాల స్వీపరే ఈ అకృత్యానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ప్రైవేటు పాఠశాలలో పనిచేసే స్వీపర్‌ ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి పలుసార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. తాజాగా బాలికకు కడుపునొప్పి రావటంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలిక శరీరంపై గాయాలు కనిపించాయి. పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్టుగా తేల్చారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో ధైర్యం తెచ్చుకున్న మరో ముగ్గురు విద్యార్థులు అతడి అరాచకాలపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు.

కాగా దక్షిణ ఢిల్లీలోని ప్రైవేటు పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆగస్టు 5న బాధిత బాలిక వెంట తను కూడా బాత్రూంలోకి చొరబడినట్టుగా సీసీటీవీలో రికార్డయింది. వాటర్‌ కూలర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడానికి అతను బాలికల బాత్రూంలోకి ప్రవేశించడాని, తర్వాత కాసేపటికి బాలిక లోపలికి వెళ్లిందని స్కూలు యాజమాన్యం చెప్పుకొచ్చింది. అంతేకాక ఇప్పటివరకు అతనిపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదంది. అయితే పలుసార్లు బాత్రూంకు, నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని బాధిత బాలిక పోలీసులకు తెలిపింది.

ఈ క్రమంలో పోలీసులు నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా పాఠశాలలో బాలికల వాష్‌రూమ్‌ క్లీన్‌ చేయడానికి పురుషుడిని నియమించడంపై సీరియస్‌ అయిన ఢిల్లీ పోలీసులు స్కూలు యాజమాన్యానికి నోటీసులు అందించామన్నారు. మరోవైపు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రీ ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలో సీసీటీవీ తప్పనిసరి అని స్పష్టం చేశారు. పోలీస్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ అతడిపై ఇప్పటికే లైంగిక వేధింపుల కింద పలు ఫిర్యాదులు అందాయన్నారు.

మరిన్ని వార్తలు