తమిళనాట ‘శుభశ్రీ’ లాంటి మరో ఉదంతం!

12 Nov, 2019 10:28 IST|Sakshi

చెన్నై : తమిళనాట బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ జెండా స్తంభం కారణంగా ఓ యువతి కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సదరు యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విచారకర ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు... అనురాధ రాజేశ్వరి(30) అనే ఓ ప్రముఖ సంస్థలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం విధుల నిమిత్తం స్కూటర్‌పై ఆఫీసుకు బయల్దేరింది. కాగా కోయంబత్తూరు హైవే మీదకు వెళ్లగానే అన్నాడీఎంకే పార్టీ జెండా కట్టేందుకు ఉపయోగించిన స్తంభం మీద పడటం గమనించిన రాజేశ్వరి దానిని తప్పించబోయి కిందపడిపోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఆమె కాళ్లపై నుంచి దూసుకుపోయింది. దీంతో రాజేశ్వరి రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. ప్రస్తుతం ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కాగా ఈ ఘటనపై రాజేశ్వరి బంధువులు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజేశ్వరి అమ్మానాన్నాలకు తను ఒక్కగానొక్క కూతురు అని... ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుందని తెలిపారు. తనకు ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి పళనిసామికి స్వాగతం పలికేందుకు అవినాశి హైవేపై పెట్టిన జెండా స్తంభం కారణంగానే ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా లారీ డ్రైవర్‌ అధిక వేగంతో దూసుకురావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా గతంలో ఇదే తరహాలో శుభశ్రీ అనే టెకీ ప్రమాదం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలపాలై మరణించడంతో అన్నాడీఎంకేపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాసు హైకోర్టు బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు శుభశ్రీ కేసులో నిందితుడిగా ఉన్న అన్నాడీఎంకే నాయకుడు జయగోపాల్‌కు సోమవారమే బెయిలు మంజూరుకావడం గమనార్హం.

మరిన్ని వార్తలు