గోవా బీచ్‌లో తాండూరు వాసి హత్య   

2 Jul, 2018 01:02 IST|Sakshi

తాండూరు: వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన వ్యక్తి గోవా బీచ్‌లో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అతడిని హతమార్చారు. తాండూరు సీతారాంపేట్‌కు చెందిన సచిన్‌ దూమాలే(37)కు 14 ఏళ్ల క్రితం సంగీతతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు నూతన్, ఆర్తీలు ఉన్నారు. సచిన్‌ పాత బట్టలను గోవా, ముంబై నుంచి సేకరించి తాండూరు మార్కెట్‌లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. తన వద్ద స్టాక్‌ లేకపోవడంతో పాత బట్టలను తీసుకువచ్చేందుకు జూన్‌ 20న గోవా వెళ్లాడు.

గోవాకు వెళ్లిన సచిన్‌ ఐదు రోజులైన ఫోన్‌ చేయకపోవడంతో సంగీత ఆందోళనకు గురైంది. శనివారం గోవా పోలీస్‌స్టేషన్‌ నుంచి సంగీతకు ఫోన్‌ వచ్చింది. వాట్సాప్‌లో ఫొటో పంపిస్తున్నాం.. గుర్తు పట్టండి అంటూ మృతుడి కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఫోన్‌ చేశారు. ఫొటోలు చూసిన సంగీత తన భర్త సచిన్‌ అని గోవా పోలీసులకు చెప్పింది. గోవా బీచ్‌లో మూడ్రోజుల క్రితం హత్యకు గురయ్యాడని తెలిపారు. దీంతో సచిన్‌ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు కుటుంబీకులు గోవాకు బయల్దేరారు.  

వీధినపడిన కుటుంబం.. 
తాండూరులో పాత బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే సచిన్‌ దూమాలే హత్యకు గురికావడంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. రెక్కాడితే కానీ డొక్కాడని దయనీయ స్థితి కావడంతో పెద్దదిక్కును కోల్పోయి భార్య, పిల్లలు అనాథలయ్యారు. సచిన్‌ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని స్థానిక నేతలు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు