భారీగా గుట్కా పట్టివేత

24 Feb, 2018 09:13 IST|Sakshi
పట్టుబడిన గుట్కా విక్రయదారులు

హుజూరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్‌ దాడులు

నలుగురు విక్రయదారుల అరెస్ట్‌

పరారీలో మరో ఇద్దరు.. కారు స్వాధీనం

గుట్కా విలువ రూ. 1.50 లక్షలు

కరీంనగర్‌, హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న గుట్కాదందాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. నిషేధిత గుట్కా విక్రయాలు జరుపుతున్న నలుగురు వ్యాపారులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 1.50 లక్షల విలువైన గుట్కాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. 

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల వివరాల ప్రకారం..  
హుజూరాబాద్‌ పట్టణంలోని మామిండ్లవాడు చెందిన దేవునూరి భాస్కర్, ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన భూపతి రాజు హుజూరాబాద్‌లో కిరాణా దుకాణం నడిపిస్తూ ఉపాధి పొందుతున్నారు. అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో నిషేధిత గుట్కాదందా సాగిస్తున్నారు. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన ఎక్కటి సంతోష్, కమలాపూర్‌ మండలం ఉప్పల్‌కు చెందిన నరేష్‌ వద్దనుంచి గుట్కాను తీసుకొస్తూ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నారు. 

పక్కా సమాచారంతో..
పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేయగా దేవునూరి భాస్కర్, రాజు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. వారిని విచారించగా.. హుజూరాబాద్‌ పట్టణ శివారులో  టీఎస్‌ 07యూఏ 0310 కారులో గుట్కాలు సరఫరా చేస్తూ ఎక్కటి సంతోష్, భాషబోయిన అశోక్‌ పట్టుపడ్డారు.

పరారీలో మరో ఇద్దరు
పట్టుబడిన వారిని విచారించగా తమకు జమ్మికుంటకు చెం దిన యాద సురేశ్‌ సరఫరా చేస్తాడని తెలిపారు. ఇతడూ, మరో వ్యాపారి ఉప్పల్‌కు చెందిన నరేశ్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. అయితే వీరిపై గతంలో కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయని తెలిపారు. 

దందా అంతా వీరి చేతుల్లోనే..
హుజూరాబాద్‌ ఏరియాలో గుట్కా దందా అంతా వీరి చేతుల్లోనే నడుస్తుందని సమాచారం. పెద్దమొత్తంలో డీసీఎం, కార్లలో తీసుకొచ్చి స్థానికంగా చిన్నచిన్న దుకాణాల్లో సరఫరా చేస్తున్నారు. ఈ తతంగం అంతా రాత్రివేళలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు జమ్మికుంట, కమలాపూర్, ఉప్పల్, ఎల్కతుర్తి, హుజూరాబాద్‌ మండలాల్లోని పలువురు దందా సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గుట్కాదందాపై ఉక్కుపాదం  
కమిషనరేట్‌ పరిధిలో గుట్కాదందాపై ఉక్కుపాదం మోపు తామని టాస్క్‌ఫోర్స్‌ సీఐలు శ్రీనివాస్‌రావు, మాధవి, కిరణ్‌ తెలిపారు. హుజూరాబాద్‌కు  గుట్కా సరఫరా చేసే వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో టౌన్‌ సీఐ వీవీ. రమణమూర్తి, టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై రమేష్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు