లండన్ : ఓ మనిషిని ఇంత దారుణంగా చంపొచ్చా?! అని ఆశ్చర్యపడేలా ఓ టాక్సీ డ్రైవర్ తన భార్యను చంపాడు. మామూలుగా చంపితే కిక్ ఏముంటుంది అనుకున్నాడో ఏమో! పెనంతో కొట్టి, కత్తితో 38 సార్లు పొడిచి, గొంతునులిమి దారుణంగా చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్కు చెందిన మహ్మద్ ఖురేషీ, (27) పర్వీన్లు భార్యాభర్తలు. పెళ్లైన తర్వాత ఇద్దరూ కెంట్కు వచ్చేశారు. వృత్తి రీత్యా టాక్సీ డ్రైవర్ అయిన ఖురేషీ భార్యను తనతో పాటు హల్(ఇంగ్లాండ్లోని ఓ పోర్టు)కు రావాల్సిందిగా కోరాడు. అయితే లా చదువుతున్న పర్వీన్.. కెంట్(ఇంగ్లాండ్లోని ఓ ప్రదేశం)ను విడిచి రావటానికి ఒప్పుకోలేదు. ఈ విషయం బయటకు తెలిసి ‘‘ఖురేషీ భార్య అతన్ని లెక్కచేయదు’’ అని బయటివాళ్లు ఎగతాళి చేయటం ప్రారంభించారు. దానికి తోడు చదువు విషయంలో పర్వీన్కు అతడికి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన ఖురేషీ వంటగదిలో ఉన్న భార్యపై దాడికి పాల్పడ్డాడు. పెనంతో ఆమె తలపై గట్టిగా బాదాడు.. 38 సార్లు కత్తితో పొడిచాడు.. అంతటితో ఆగకుండా ఆమె గొంతునులిమి పాశవికంగా హత్య చేశాడు.
అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఎలాగైనా దేశం విడిచి పారిపోవాలని అనుకున్నాడు కానీ కుదరలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత పర్వీన్ కోసం ఇంటికి వచ్చిన ఆమె తండ్రి రక్తపు మడుగుల్లో పడిఉన్న కూతుర్ని చూసి హతాశుడయ్యాడు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అంతకు చాలా సేపటిక్రితమే పర్వీన్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పర్వీన్ తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఖురేషీని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. 2018లో జరిగిన ఈ సంఘటనపై తాజాగా విచారణ జరిపిన కోర్టు.. నేర తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఖురీషీకి 16 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.