అవమాన భారంతో బాధితురాలి ఆత్మహత్యాయత్నం
అనంతపురం, కనగానపల్లి: కనగానపల్లి మండలంలోని ఒక గ్రామంలో ఓ వివాహితపై టీడీపీ కార్యకర్త అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు అవమాన భారంతో ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఒంటరిగా ఉన్న వివాహితపై స్థానిక టీడీపీ కార్యకర్త హరి అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దీన్ని గమనించిన హరి అక్కడి నుంచి పరారయ్యాడు.
సోమవారం ఉదయం బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న సీఐ చంద్రశేఖర్ కనగానపల్లి పోలీసులతో కలసి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. గ్రామంలో ఘర్షణలు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితురాలు అవమానం భరించలేక సాయంత్రం పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితురాలి నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.