సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లాలని టీడీపీ అధ్యక్షుడు చేసిన కుట్ర మరోసారి బట్టబయలైంది. తిరుమలలో చర్చిలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్యపు ప్రచారం వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నట్టుగా తేలింది. తిరుమల అన్యమత ప్రచారం జరుగుతోదంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో హైదరాబాద్కు కేపీహెచ్బీ కాలనీకి చెందిన కాటేపల్లి అరుణ్కుమార్, హైదరాబాద్కు చెందిన గరికపాటి కార్తీక్, మిక్కినేని సాయిఅభితేజ్లు ఉన్నారు.
అయితే నిందుతులంతా కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడుని స్వయంగా కలిశారు. వీరిని టీడీపీ పొలిటకల్ అడ్వైజర్ ఈతకోట జయప్రకాశ్ చంద్రబాబుకు పరిచయం చేశారు. అప్పటి నుంచి తిరుపతిలో అన్యమత ప్రచారం అంటూ వీరు కుట్రలకు పాల్పడ్డారు. తాము గతంలో టీడీపీ కార్యకర్తలుగా పనిచేసినట్టు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని చంద్రబాబు వీరిని ఆదేశించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా పోస్టుల పెట్టాలని వారికి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే తప్పుడు ప్రచారంపై విచారణ చేపట్టిన తిరుపతి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి ఈ నెల 19వరకు రిమాండ్ విధించారు.
ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతోదంటూ టీడీపీ నీచమైన రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కుట్రలో భాగంగానే ఆ పార్టీ సానుభూతిపరులు తిరుమలలో అన్యమత ప్రచారం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అడ్డంగా బుక్కయ్యారని అన్నారు.