సాక్షి, నెల్లూరు: విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ)పై దాడి చేసిన టీడీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఆర్ఐకి ఫోన్ చేస్తే ఎత్తలేదని ఇందూరు వెంకట రమణారెడ్డి అనే టీడీపీ నాయకుడికి కోపం వచ్చింది. దీంతో ఆయన సరాసరి రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఆర్ఐ షేక్ బషీర్పై దాడి చేశాడు. దాడిలో అతనికి చేయి విరగగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత ఆర్ఐ, రెవెన్యూ ఉద్యోగులు ఆత్మకూరు పోలీసు స్టేషన్లో అదేరోజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం రమణారెడ్డి, అతని అనుచరుడు నూర్బాషా(మహ్మద్)లను అరెస్టు చేసి జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఆయన వారిద్దరికి 14 రోజులు రిమాండ్ విధించడంతో సబ్ జైలుకు తరలించారు. విషయం తెలుసుకున్నఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జైలు వద్దకు చేరుకుని రమణారెడ్డిని పరామర్శించారు.