తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రిసార్ట్లో పట్టుబడిన వైనం
గతంలోనూ ముజ్రా పార్టీలో దొరికిన కొందరు టీడీపీ కార్పొరేటర్లు
పటమట(విజయవాడ తూర్పు): ముజ్రా, రేవ్ పార్టీలలో టీడీపీ నగర ప్రజాప్రతినిధులు మునిగి తేలుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం రేవ్పార్టీలో నగరానికి చెందిన కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు పట్టుబడ్డారని సమాచారం. గతంలో విజయవాడలో నిర్వహించిన ముజ్రా పార్టీలోనూ పలువురు కార్పొరేటర్లు ఉన్న ఘటన మర్చిపోకముందే తాజాగా మరో రేవ్ పార్టీలో కార్పొరేటర్లు దొరకడంసర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా దర్జాగా క్లబ్బులు, పార్టీల్లో కులుకుతున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. పట్టుబడిన కార్పొరేటర్లు నగరాభివృద్ధికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలకు అధ్యక్షులు కూడా.
వీఎంసీలో రోడ్డు భద్రతను పెంచేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో కీలక నాయకులుగా బాధ్యతలు నిర్వహిస్తూ.. నేరుగా ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించదగిన పలుకుపడి ఉన్న నాయకుడు ఒకరైతే... మూడు రోజుల కిందట కార్పొరేటర్లు పార్టీ నిర్వహించిన డివిజన్ స్థాయి సమావేశాలకు కూడా హాజరుకాకుండా నగరం నుంచి ఐదు ఖరీదైన కార్లలో రంప చోడవరానికి వెళ్లారని పార్టీ వర్గాల సమాచారం. నగరంలోని వ్యాపార కూడలికి ప్రసిద్ధి చెందిన బీసెంట్రోడ్డుకు చెందిన మరో కార్పొరేటర్ కూడా రేవ్పార్టీలో పట్టుబడ్డట్లు సమాచారం.
తూర్పులో అంతా ఆయనే...
తూర్పు నియోజవర్గంలో కీలకమైన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ వీఎంసీలో నగరపాలక సంస్థ స్టడీ టూర్లు, ఇతర యాత్రలకు సంబంధించి ఎలాంటి ప్రయాణాలు జరగాలన్నా తాను ముందుండి మిగిలినవారిని ఫాలోఅప్ చేస్తారు.