బాలికపై టీడీపీ నేతల అత్యాచారయత్నం

4 May, 2018 03:40 IST|Sakshi

అన్నవరం (ప్రత్తిపాడు): అధికార మదంతో తూగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతని అనుచరులు ముగ్గురు ఓ బాలికపై అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు వీరిపై తిరగబ డటంతో వీరు పరారయ్యారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి తూర్పు గోదావరి జిల్లా తుని నియో జకవర్గం తొండంగి మండలం తమ్మయ్యపేట గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కత్తిపూడికి చెందిన టీడీపీ ఎంపీటీసీ కంచిబోయిన సంధ్య భర్త శ్రీనివాస్, ఆయన అనుచరులు శ్రావణ్, రవి, సత్యనారాయణ, బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అన్నవరం నుంచి కత్తిపూడి వెళ్తూ తమ్మయ్యపేట వద్ద ఉన్న టీ దుకాణం వద్ద ఆగి టీ కావాలని అడిగారు.

ఆ దుకాణాన్ని ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలసి నిర్వహిస్తోంది. ఇంత అర్ధరాత్రి టీ ఏంటని ఆమె ప్రశ్నించడంతో ‘మాకే అడ్డు చెబుతావా’ అంటూ అక్కడే ఉన్న ఆమె పెద్ద కుమార్తె (17) చేయి పట్టుకుని పక్కనే ఉన్న తోటలోకి శ్రీనివాస్, అతని ముగ్గురు అనుచరులు లాక్కుని పోతుండగా, తల్లితోపాటు ఆమె చిన్న కుమార్తె గట్టిగా అరవడంతో స్థానికులు పరుగున వచ్చి వారిని అడ్డుకున్నారు. అయినా వారిపై దుర్భాషలాడుతూ ‘ప్రభుత్వం మాది ఏమి చేసినా చెల్లుబాటవుతుందని’ వాదనకు దిగడంతో స్థానికులు వెనకడుగు వేయకుండా ప్రతిఘటించడంతో పరారయ్యారు. కాగా, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిబోయిన శ్రీనివాస్, శ్రావణ్, రవి, సత్యనారాయణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తొండంగి ఎస్‌ఐ జగన్మోహన్‌రావు తెలిపారు. 

మరిన్ని వార్తలు