పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అరెస్ట్

25 Aug, 2019 15:10 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వరద సహాయకచర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం కట్టడంతో పాటు, మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పైనా, యాదవ కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడు. శేఖర్ చౌదరిది గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసే పెయిడ్‌ పబ్లిసిటీలో ఇతడు కీలకంగా వ్యవహరించాడు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటనల్లో కూడా నటించాడు.

ఇటీవల వరద సమయంలో రైతు వేషం కట్టి  తానే ఒక రైతును అని ప్రజలను నమ్మించడం ద్వారా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న భావన కలిగించేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నటించాడు శేఖర్‌ చౌదరి.  దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తాము కుట్రలో భాగంగానే రైతు వేషం కట్టి ప్రభుత్వాన్ని తిట్టినట్టు అంగీకరించాడు.  తనతో పాటు ప్రభుత్వంపై బురద జల్లేందుకు పలువురిని టీడీపీ ఉపయోగిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. వివిధ వర్గాల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులే ప్రభుత్వాన్ని తిట్టిపోసి, ఆ వీడియోలను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రను అతడు బయటపెట్టినట్టు తెలుస్తోంది.

కాగా  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి అసభ్యంగా మాట్లాడుతూ.. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ కులాన్ని దూషించిన కుడితిపూడి శేఖర్‌చౌదరి చేసిన వీడియోపై ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ దేవేంద్రరెడ్డి గుర్రంపాటి  గురువారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు శేఖర్‌చౌదరిపై గుంటూరు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు