విద్యార్థిని ఐరన్‌ స్కేల్‌తో తలపై బాదిన టీచర్‌

22 Jan, 2020 01:29 IST|Sakshi

కుషాయిగూడ: ఓ టీచర్‌ ఏడో తరగతి విద్యార్థి తలపై ఐరన్‌ స్కేల్‌తో కొట్టడంతో గాయమైంది. ఈ విషయంపై ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో ఇది కాస్తా పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారు. హెచ్‌బీకాలనీలో నివసించే భార్గవి కుమారుడు నిఖిల్‌సాయి ఈసీఐఎల్‌లోని యస్‌ఆర్‌ డీజీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం టీచర్‌ శశికళ క్లాస్‌ తీసుకునేందుకు తరగతి గదికి వెళ్లారు. అల్లరి చేస్తున్న విద్యార్థులను వారిస్తున్న క్రమంలో నిఖిల్‌సాయిని ఆమె ఐరన్‌ స్కేల్‌తో తలపై కొట్టారు.

దీంతో రక్తస్రావమై బాలుడి తలకు గాయమైంది. దీంతో జరిగిన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. బాలుడి తల్లి భార్గవి ప్రిన్సిపల్‌ను నిలదీయగా..ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో బాలుడి తాతయ్య దయానంద్‌తో కలిసి ఆమె కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా 5 గంటలు స్టేషన్‌లోనే ఉంచారు. రాత్రి 11 గంటల సమయంలో వారుఅక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం కాస్తా మీడియాకు పొక్కడంతో మంగళవారం ఉదయం పోలీసులు బాధితులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ చేపట్టి బాలుడిని కొట్టిన టీచర్‌తో పాటు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశామన్నారు.

మరిన్ని వార్తలు